అల్వాల్, మే 4: కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై భాస్కర్ కథనం ప్రకారం.. ఖానాజీగూడకు చెందిన అల్లాడి శివాని(28) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి తన కియా కారు(టీఎస్ 07 సీఎం టీ/ఆర్ 8037)లో బయటికి వెళ్లిన ఆమె సుమారు పదిన్నర గంటలకు తిరిగి ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలోనే డెయిరీ ఫామ్ రోడ్డులో వెళ్తుండగా.. అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న స్విగ్గీ డెలివరీ బాయ్ రాజు(30), మరో వ్యక్తి రాజ్కుమార్(29)ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారు చెరుకు బండి, టిఫిన్ సెంటర్తోపాటు కరెంట్ స్తంభానికి ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ఘటనలో డెలివరీ బాయ్ రాజు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. సికింద్రాబాద్కు చెందిన రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాల్బజార్కు చెందిన రాజ్కుమార్కు కాలు విరుగడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను వెళ్తుండగా ఓ వ్యక్తి సడన్గా అడ్డురావడంతో బీపీ డౌన్ అయిపోయి స్ఫృహ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని శివాని వీడియో ద్వారా తెలిపింది.