మెహిదీపట్నం : హాయ్ అనే పలకరింపుతో ప్రారంభం అయ్యే సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విరివిగా పెరిగిన తరుణంలో అది ప్రాణాంతకంగా మారుతుంది సైబర్ కైమ్లలో మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్న గ్యాంగ్లు ఇప్పుడు అందమైన అమ్మాయిలతో నగ్న వీడియో కాలింగ్లు చేయిస్తూ అమాయకులను బుట్టలో వేసుకుని బ్లాక్మెయిలింగ్లకు పాల్పడుతున్నారు. బ్లాక్ మెయిలింగ్లకు భయపడి పరువు పోతుందని చాలా మంది అగంతకులు అడిగిన డబ్బులు ఇచ్చి ఊరుకుంటున్నారు. అయినా బ్లాక్ మెయిలింగ్ అక్కడితో ఆగకుండా కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం నగరంలో ఈ రకమైన మోసాలు జోరుగా సాగుతున్నాయి. బ్లాక్మెయిలింగ్ బారిన పడ్డ ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పశ్చిమమండలం పరిధిలో గత ఏడాది కాలంలో ముగ్గురు యువకులు నగ్నవీడియో కాలింగ్ల అగంతకుల బ్లాక్మెయిలింగ్కు భయపడి ప్రాణాలను తీసుకున్నారు.ఆయా కుటుంబాల వారు పరువుకు భయపడి ఏవో కారణాలు చెప్పి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కానీ ఆ యువకుల మృతి ఖచ్చితంగా నగ్న వీడియో కాలింగ్ల వల్లనే జరిగిందని వారి స్నేహితులు అంటున్నారు.
సోషల్ మీడియా వాడకం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ ,వాట్సాప్ అకౌంట్లు కల్గి ఉంటున్నారు. ఫేస్ బుక్ అకౌంట్లలో ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, అహ్మదాబాద్, గోవా, భువనేశ్వర్, పూణె, చెన్నై, కోయంబత్తూర్, కేరళ, కొచ్చి తదితర ప్రాంతాల నుంచి ఫేస్బుక్ అకౌంట్లలో అమ్మాయిల పేర్లతో అకౌంట్లు తెరుస్తున్నారు.
ఆయా అకౌంట్ల నుంచి అమాయకులైన యువకులకు, వ్యక్తులకు ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ పంపడం వారు ఒకే అనగానే హాయ్ అని పలకరింపుతో పరిచయం పెంచుకోవడం ప్రారంభం అవుతుంది.అనంతరం తీయని చాటింగ్తో వాట్సప్ నెంబర్ తీసుకోవడం వీడియో కాల్ చేయడానికి ప్రేరేపించడం క్షణాల్లో జరిగిపోతుంది.
మెల్ల, మెల్లగా మాటలు కలిపి నగ్న వీడియో కాలింగ్ ప్రారంభించి బుట్టలో వేసుకుంటారు. అనంతరం నగ్న వీడియో కాలింగ్ సమయంలో స్క్రీన్ షాట్స్ తీసుకుని బ్లాక్ మెయిలింగ్ ప్రారంభిస్తారు. మీ వీడియోలు మీ స్నేహితులకు, కుటుంబసభ్యులకు పంపుతామని చెప్పి డబ్బులు గూగుల్ పే, ఫోన్ పే చేయాలంటూ బలవంతంగా వసూలు మొదలుపెడతారు.
దేశంలో ఎన్నో ప్రాంతాలలో ఇలాంటి మోసాలు జరుగుతున్నా ఎక్కడా ఆత్మహత్యలు జరిగిన దాఖలాలు లేవు. కాని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్లో మాత్రం గత ఏడాది కాలంగా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఆసిఫ్నగర్, టప్పాచబుత్ర, లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముగ్గురు యువకులు నగ్నవీడియో కాలింగ్ కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
తస్మాత్ జాగ్రత్త……
సోషల్ మీడియాలో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్లు జరుగుతున్న నేపథ్యంలో యువత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు. నగ్న వీడియో కాలింగ్కు సంబంధించిన అకౌంట్లు రాత్రి పది గంటల తర్వాతనే ఫేస్బుక్లలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఆ సమయంలో ఒంటరిగా ఉండే యువకులు తీయటి చాటింగ్లో పడి తమకు తాముగా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు.
దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ రోజూ తమ చాటింగ్లో పరిచయం అయ్యే కొత్త వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫేక్ ఐడీలతో వచ్చేవారిని జాగ్రత్తగా గమనించి వెంటనే వారిని తమ ఫేస్బుక్ అకౌంట్లో బ్లాక్ చేయాలి. అంతే కాకుండా వారి రిక్వెస్ట్లను తిరస్కరించాలి.ఇలాంటి బ్లాక్ మెయిలింగ్లు జరిగే సమయంలో సంబంధిత అకౌంట్ వారు తమ ఫ్రొఫైల్ను లాక్ చేసుకుంటే కొంత వరకు నష్టాన్ని నివారించవచ్చు.అప్పటికప్పుడు తమ అకౌంట్ను ఫేస్బుక్ నుంచి డిలీట్ చేసుకుంటే కూడా బ్లాక్ మెయిలింగ్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
సోషల్ మీడియాలో మోసాలకు గురవుతున్న వారు భయానికి గురి కాకుండా కొంచెం ధైర్యం చేసి సైబర్ సెల్లో ఫిర్యాదులు చేస్తే ఇలాంటి వారి మోసాలను అరికట్టి వేరే వారు మోసపోకుండా సహకరించిన వారు అవుతారు.