మియాపూర్ , జనవరి 21 : కరోనాను ఇంటి వద్దే కట్టడి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఫీవర్ సర్వే’ శేరిలింగంపల్లి జోన్లో శుక్రవారం ప్రారంభమైంది. జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లయిన యూసుఫ్గూడ, చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరులలో ఈ ఫీవర్ సర్వే జరిగింది. జోన్ వ్యాప్తంగా 130 బృందాలు సర్వేలో పాల్గొని 5500 ఇండ్లలో ప్రాథమిక సర్వే చేపట్టాయి. ఈ సందర్భంగా జ్వర లక్షణాలున్న 574 మందిని క్షేత్రస్థాయిలో గుర్తించిన సిబ్బంది అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేశారు. యూసుఫ్గూడ, పటాన్ చెరు సర్కిళ్ల పరిధిలోనే 482 జ్వర బాధితులను గుర్తించగా, అదే సంఖ్యలో హోం ఐసొలేషన్ కిట్లను అందించారు. కరోనా నేపథ్యంలో కిట్ల వాడకంతో ఇంటి వద్దే ఉంటూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై క్షేత్రస్థాయిలో సర్వే సిబ్బంది బాధితులకు వివరించారు. కాగా, తొలి రోజు ‘ఫీవర్ సర్వే’ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అల ప్రియాంక చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ డివిజన్లో తనిఖీ చేశారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, జ్వరం లక్షణాలున్న వారి వివరాలను పక్కాగా నమోదు చేసి హోం ఐసొలేషన్ కిట్లను అందించాలని ఈ సందర్భంగా జడ్సీ ఆదేశించారు. సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తూ సర్వేను విజయవంతంగా చేపట్టాలని, వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. కాగా, ఆయా సర్కిళ్ల వైద్యాధికారులు డాక్టర్ రవి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ బిందు మాధవి, డాక్టర్ రంజిత్ ఫీవర్ సర్వేను పర్యవేక్షించారు.