కొండాపూర్, ఆగస్టు 9: ఆదిమానవుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భవిషత్ తరాలకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఆద్య కళా ప్రదర్శన అత్యద్భుతంగా ఉందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. సోమవారం మాదాపూర్లోని ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆద్య కళా ప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతమవుతున్న ఆదివాసుల కళలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో దశాబ్దాల పాటు శ్రమించి పురాతన వస్తువులను సేకరించిన జయధీర్ తిరుమల్రావును అభినందించారు. ఈ ప్రదర్శనలోని ఆది మానవుడి కళలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయని అన్నారు. పెయింటింగ్స్, పూజా సామగ్రి, దేవతా మూర్తుల విగ్రహాలు, సంగీత వాయిద్య పరికరాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మి, రౌనక్యార్ ఖాన్ పాల్గొన్నారు.