చర్లపల్లి, సెప్టెంబర్ 12 : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్తో కూడిన జడ్జిల బృందం ఆదివారం చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని సందర్శించింది. ఖైదీల సంక్షేమానికి చేపట్టిన సంస్కరణలను తెలంగాణ జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది, ఉన్నతి కార్యక్రమం ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ బీనాలను అడిగి తెలుసుకున్నది. జైలులోని పలు బ్యారక్లు, ఖైదీలు పండిస్తున్న పంటల వివరాలను డీజీ రాజీవ్ త్రివేది న్యాయమూర్తుల బృందానికి వివరించారు. సైకాలాజీ ల్యాబ్, వంటశాలను పరిశీలించిన బృందం సభ్యులు… ఖైదీలకు అందిస్తున్న భోజనం రుచి చూసి అధికారులను అభినందించారు.
కారాగారంలో ఏర్పాటు చేసిన ‘ఉన్నతి’ కార్యక్రమంలో భాగంగా ఖైదీల సంక్షేమం కోసం చేపట్టిన సంస్కరణలు, విడుదల అనంతరం వారికి కల్పిస్తున్న పునరావాస చర్యలు, ఉపాధి అవకాశాలను డీజీ వారికి తెలియజేశారు. అనంతరం సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ మాట్లాడుతూ ఖైదీల మానసిక ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు వారి సంక్షేమం కోసం ఉన్నతి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని జైళ్లలో చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీజీ రాజీవ్ త్రివేది మాట్లాడుతూ ఖైదీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ముఖ్యంగా వారి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం బృందం సభ్యులను తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కారాగారాన్ని సందర్శించిన బృందంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, కార్యదర్శి అశోక్జైన్, ఎస్ఎల్ఎస్ఏ సభ్యురాలు రేణుక, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ సెషన్స్ జడ్జి రాధారాణి, డీఎల్ఎస్ఏ సభ్యురాలు, జిల్లా కార్యదర్శి శ్రీదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమ చక్రవర్తి, హైకోర్టు ఉన్నతాధికారి ఆంజనేయులు ఉన్నారు. జైళ్ల శాఖ ఐజీ రాజేశ్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ మురళీబాబు, కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ సంపత్, వ్యవసాయక్షేత్రం సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణమూర్తి, కాళీదాస్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.