ఉప్పల్, మార్చి 26 : ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్కు సర్వం సిద్ధం చేశారు. స్టేడియంలో ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బుధవారం సాయంత్రం మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఈ మేరకు చేపట్టిన భద్రతా చర్యలపై రాచకొండ సీపీ తరుణ్జోషి, మల్కాజిగిరి డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు. స్టేడియంలో 2800 మంది సిబ్బందితో భద్రత, 360 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా మ్యాచ్ సమయంలో భారీ వాహనాలను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మ్యాచ్కు మూడు గంటల సమయం ముందు నుంచే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. భద్రతలో భాగంగా అంబులెన్స్, మెడికల్, ఫైరింజన్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రేక్షకులు వాహనాలను నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు. బ్లాక్లో టికెట్స్ విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బుధవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్ఎండీఏ భగాయత్ లే అవుట్ ద్వారా నాగోల్ వైపు మళ్లిస్తామని, అదేవిధంగా నాగోల్ నుంచి వచ్చే వాహనాలు మెట్రోస్టేషన్ నుంచి యూ టర్న్ తీసుకొని, భగాయత్ లేఅవుట్ నుంచి వెళ్లాలని తెలిపారు. తార్నాక నుంచి వచ్చే వాహనాలను హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం వైపు ట్రాఫిక్ను మళ్లిస్తామని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
షార్ప్ మెటల్స్, బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ల్యాప్టాప్, వాటర్బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరేట్స్, బైనాక్యులర్స్, హెల్మెట్లు, ఫర్ప్యూమ్స్, ఫుడ్ ఐటమ్స్, తదితర వస్తువులు స్టేడియంలోకి అనుమతి లేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత పోలీసులు సూచించిన విధంగా ప్రేక్షకులు వెళ్లాలని సీపీ పేర్కొన్నారు. మ్యాచ్ మధ్యలో స్టేడియంలోకి ఎవరూ రావద్దని చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్లు జరుగనున్నాయి. 39 వేల మంది సామర్థ్యం కలిగిన స్టేడియంలో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెట్రోరైలు సమయాన్ని పొడిగించారు. సీసీ కెమెరాలతో పూర్తిస్థాయి నిఘాను ఏర్పాటు చేశామన్నారు.