సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మహిళా సాధికారత, గృహ హింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ తక్షణమే చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో మహిళలకు సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలు, చట్టాలు, వాటి అమలు తీరుతెన్నులపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఓ సారి స్త్రీల సమస్యలపై పర్యవేక్షణ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆశ, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలకు స్త్రీల సమస్యలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోష్ చట్టం మీద అవగాహన కల్పించాలని, ప్రతి హాస్టల్, స్కూల్స్, కాలేజీలలో 181, 1089 సఖీ సెంటర్, స్థానిక పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్ర, ఈశ్వరీభాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుదాం లక్ష్మీ, కటారి రేవతిరావు, కమిషన్ సెక్రెటరీ సునంద, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ శాఖాధికారి అక్కేశ్వరరావు పాల్గొన్నారు.