ఖైరతాబాద్, ఆగస్టు 14 : అవయవదానంతో మరొకరికి జీవితాన్ని ప్రసాదించవచ్చని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సీతామహాలక్ష్మి అన్నారు. శనివారం సాయంత్రం లక్డీకాపూల్లో దౌలత్ ప్లాజాలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత అవయవదాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు అవయవదానానికి ముందుకు వస్తున్నారని, సెలబ్రిటీలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది అవయవదానానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారన్నారు. సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా తన అవయవాలన్నింటిని గాంధీ దవాఖానకు దానం చేయనున్నట్లు పత్రం రాసి ఇచ్చారని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స్నేహ టెలివిజన్ గ్రూప్ ఏజీఎం (హెచ్ఆర్) పద్మ శర్మ , ఉస్మానియా దవాఖాన దంతవైద్యుడు డాక్టర్ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.