మేడ్చల్, డిసెంబర్ 11: విద్యార్థి విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే ఉపన్యాస బోధన పద్ధతి అనుసరణీయం కాదు. ప్రధానంగా సైన్స్ పాఠాలు అవగతం చేసుకోవాలంటే కృత్యాధార బోధన ఒక్కటే ఉత్తమమైన పద్ధతి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అగస్త్య ఫౌండేషన్ గౌడవెల్లి గ్రామ పరిధిలో ఉన్న కృషిహోమ్స్ సహకారంతో మేడ్చల్ మండలంలో కృత్యాధార బోధన పద్ధతిని అమలు చేస్తున్నది. ఐదేండ్లుగా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో మొబైల్ సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో చైతన్యం తీసుకువస్తూ.. ఉత్తమ ఫలితాలు రాబడుతున్నది.
6 నుంచి10వ తరగతి వరకు..
6 నుంచి 10వ తరగతి వరకు సైన్స్ పుస్తకాల్లో ఉన్న అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రయోగాలను ప్రత్యక్షంగా బోధించడానికి అనువైన పరికరాలు మొబైల్ సైన్స్ ల్యాబ్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని వర్కింగ్ మోడల్స్, డెమో మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి పుస్తకాల్లో నేర్చుకుంది, నేరుగా చూడటం ద్వారా 100 శాతం విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాంతి, కార్బన్ రసాయనిక సమ్మేళనాలు, నియంత్రణ, సమన్వయం, జీవక్రియల్లో సమన్వయం తదితర కష్టతరమైన పాఠ్యాంశాలను విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటున్నారు.
ఏడు పాఠశాలల్లో బోధన..
మేడ్చల్ మండలంలో కృత్యాధార బోధనకు ప్రతి ఏటా ఏడు పాఠశాలలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ సారి గౌడవెల్లి, అత్వెల్లి, రావల్కోల్, నూతన్కల్, మేడ్చల్, గిర్మాపూర్, డబిల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. ఒక్కో పాఠశాలలో మూడేండ్ల పాటు బోధిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని కొత్త పాఠశాలలను చేర్చుకుంటున్నారు. ఆయా పాఠశాలలకు 15 రోజులకోమారు మొబైల్ సైన్స్ ల్యాబ్తో అగస్త్య ప్రతినిధులు అపర్ణ, శివకుమార్ వెళ్లి బోధిస్తున్నారు. బోధనతో కేవలం పాఠ్యాంశాలపై అవగాహన కల్పించడమే కాకుండా ఆసక్తి, సృజనాత్మకతను, నమ్మకాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్నారు. అలాగే విజ్ఞాన మేళాలను నిర్వహించి, విద్యార్థులు క్రియాశీలకంగా వ్యవహరించేందుకు తోడ్పాటునందిస్తున్నారు. ఉపాధ్యాయులకు సైతం ప్రయోగాల నిర్వహణపై శిక్షణనిచ్చి, విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు.
గ్రామాల్లో అవగాహన ..
అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు సైన్స్ మాద్యమాన్ని వినియోగించుకొని పాఠశాలలతో పాటు గ్రామాల్లో, జనసాంద్రత గల ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. చదువు ప్రాధాన్యత, ఆల్కహాల్ వినియోగంతో పొడసూపే అనర్థాలు, మంత్ర, తంత్రాల్లాంటి మూడ నమ్మకాలను పారద్రోలేందుకు తమ ప్రయోగాల ద్వారా కృషి చేస్తున్నారు. ఆపరేషన్ వసంత సెంటర్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల హోం వర్క్ చేయించేందుకు, ఫన్ యాక్టివిటీస్ ద్వారా చదువుపై ఆసక్తి పెంచేందుకు వలంటీర్ను ఏర్పాటు చేస్తున్నారు. యంగ్ ఇన్స్ట్రక్టర్ లీడర్ ద్వారా విద్యార్థుల్లో లీడర్ షిప్ క్వాలిటీస్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. వేసవిలో కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వందశాతం కాన్సెప్ట్
కండ్లతో చూడటం, చెవులతో వినడం, చేతులను తడపటం ద్వారా అనుభవ విద్య గడిస్తే వంద శాతం కాన్సెప్ట్ అర్థం అవుతుంది. లైఫ్లో మార్చిపోకుండా ఉంటారు. ఉపన్యాన బోధన పద్ధతి ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు. బట్టిపట్టి భయంతో పరీక్షల్లో జవాబు రాస్తుంటారు. అదే అనుభవ విద్యతో పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటే వందశాతం జవాబు రాయగలుగుతారు. సైన్స్ ఫెయిర్ల నిర్వహణతో విద్యార్థుల్లో క్రియాశీలకతను పెంపొందిస్తున్నాం.
-శ్రీదేవి, ఏరియా లీడర్, మేడ్చల్
సులభంగా అర్థం చేసుకుంటున్నాం
అగస్త్య ఫౌండేషన్ ప్రయోగాల ద్వారా చేస్తున్న బోధనతో పాఠాలు బాగా అర్థం అవుతున్నాయి. ప్రయోగం చేస్తూ బోధించడం ద్వారా కష్టతరమై పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటున్నాం. పరీక్షల్లో బాగా జవాబు రాయగలమనే నమ్మకం వచ్చింది.
– దివ్య, 10వ తరగతి, గౌడవెల్లి జడ్పీహెచ్ఎస్
మళ్లీ చదవకుండా..
ప్రయోగాల ద్వారా పాఠాలను నేర్చుకోవడం ద్వారా పరీక్షలప్పుడు మళ్లీ చదవాల్సిన అవసరం రావడం లేదు. వంద శాతం జవాబు రాయగలమనే నమ్మకం వచ్చింది. ఈ పద్ధతిలో బోధిస్తున్న అగస్త్య ఫౌండేషన్కు కృతజ్ఞతలు. అంతకు ముందు సైన్స్ పాఠాలంటే భయంగా ఉండేది. ఇప్పుడు సైన్స్ ఫెయిర్లో కూడా పాల్గొనాలనే ఆసక్తి వచ్చింది.
– స్పందన, 9వ తరగతి,నూతన్కల్ జడ్పీహెచ్ఎస్