కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 31 : కొవిడ్తో ఆర్థికంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులకు మరింత భరోసాను కల్పించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడని వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం స్వనిధిలో రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లింపులు చేసిన వారికి రెట్టింపు రుణాలను అందిస్తున్నారు. స్వనిధి సే సమృద్ధిలో భాగంగా వీధి వ్యాపారుల కుటుంబ సభ్యుల్లో అర్హత కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన 8 సంక్షేమ పథకాలలో భాగస్తులను చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను అందించడంతో పాటు వ్యాపారాలు చేసుకునేందుకు అనువైణ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల వెంబడి గల్లీల్లో వీధి వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించే దిశగా ముమ్మర కసరత్తును చేస్తున్నారు.
వీధి వ్యాపారులను ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)తో వీధి వ్యాపారులందరికీ బ్యాంకుల ద్వారా రూ.10వేల రుణాలను అందించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సర్వేను చేపట్టి 4500 మంది వీధి వ్యాపారులు రుణాలు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. ముందుగా వీరందరికీ గుర్తింపు కార్డులను ఇచ్చి.. తర్వాత బ్యాంకు ద్వారా రూ.10వేల రుణాలను అందించారు. జంట సర్కిళ్లలో 3281 మంది వీధి వ్యాపారులకు 10వేల రుణాలను అందించారు. ఈ రుణాలను పది నెలలోపు చెల్లిస్తే వడ్డీలో 7శాతం రాయితీ, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించారు. రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి రెండో దఫా 20వేల రుణాలను అందిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే 40 మందికి పైగా 20వేల రుణాలను అందించే ప్రక్రియ పూర్తికాగా మరికొందరికి త్వరలోనే రెట్టింపు రుణాలు అందించనున్నట్లు తెలుపుతున్నారు.
‘స్వనిధి సే సమృద్ధి’లో భాగంగా వీధి వ్యాపారుల కుటుంబ సభ్యులకు సైతం సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వీధి వ్యాపారుల వివరాలను ప్రత్యేక పోర్టల్లో పొందుపర్చడం వల్ల ఎవరి ప్రమేయం లేకుండానే అర్హులైన వారికి నేరుగా బ్యాంకు అకౌంట్లో రుణం తీసుకున్న నగదు జమ అవుతుంది. ఇదే తరహాలో వారి కుటుంబ సభ్యుల్లో సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి సంక్షేమ పథకాలలో లబ్ధిదారులుగా చేర్చే దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన, శ్రమయోగి మాన్ధన్ పెన్షన్, సురక్షబీమా యోజన, జీవన్జ్యోతి బీమా యోజన, జన్ధన్ యోజన, భవన, నిర్మాణ కార్మికులుగా, ఒకేదేశం ఒకే కార్డు, జననీ సురక్ష యోజన పథకాల్లో వీధి వ్యాపారుల కుటుంబ సభ్యులను అర్హులుగా చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల వివరాలన్నింటిని సేకరిస్తూ ప్రత్యేక పోర్టల్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల వద్ద వీధి వ్యాపారులు, వారి కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా సంక్షేమ ఫలాలను అందించనున్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలను అందించే దిశగా అధికారులు బ్యాంకులతో, వివిధ శాఖాధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేస్తున్నారు.
పీఎం స్వనిధి, స్వనిధి సే సమృద్ధి పథకాల ద్వారా వీధి వ్యాపారులకు రుణాలను, సంక్షేమ ఫలాలను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కమ్యూనిటీ ఆర్గనైజర్లు రిసోర్స్ పర్సన్స్తో తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ బ్యాంకు, ఇతర శాఖాధికారులతో మాట్లాడుతూ.. అర్హులందరికీ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. జడ్సీ, డీసీల సహకారంతో జీహెచ్ఎంసీలోనే రెండోస్థానంలో నిలిచాం. అర్హులైన వీధి వ్యాపారులందరూ తప్పనిసరిగా సంక్షేమ ఫలాలను పొందాలని కోరుతున్నాం. వందశాతం లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేస్తున్నాం.- యం.శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్, కూకట్పల్లి జంట సర్కిళ్లు