Kollur | సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): శివారు ప్రాంతాల్లోనూ మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధిక ప్రాధాన్యతనిస్తున్నది. నగరం ఔటర్ రింగు రోడ్డు దాటి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన వసతులను కల్పిస్తున్నది. కొల్లూరు ఔటర్ రింగు రోడ్డు నుంచి మొదలు కొని 2 బీహెచ్కే కాలనీ మీదుగా శంకర్పల్లి రోడ్డులో ఉన్న జన్వాడ నాలుగు రోడ్ల కూడలి వరకు అత్యాధునిక వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నారు.
సుమారు రూ.1.06 కోట్లతో వీధి దీపాలను మొట్ట మొదటి సారిగా అత్యాధునిక శైలిలో ఏర్పాటు చేయనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఐటీ కారిడార్తో అనుసంధానమై ఉన్న కొల్లూరు, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో పురపాలక శాఖ ఆదేశాల మేరకు వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సంబంధించిన పనులు చేపట్టేందుకు ఇటీవలే టెండర్లు పిలిచామని అధికారులు తెలిపారు. ఈనెల 26వ తేదీ లోగా కాంట్రాక్టర్ను ఎంపిక చేసి, 3 నెలల్లో పనులు పూర్తి చేయనున్నామని తెలిపారు.