మన్సూరాబాద్, సెప్టెంబర్ 2 : నాగోల్ డివిజన్ పరిధి శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీదుర్గాదేవి దేవాలయం ప్రాంగణంలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి శివ పంచాయతన ఆంజనేయ నాగ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు కాసుల చంద్రశేఖర శాస్త్రి పర్యవేక్షణలో మూడు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా గురువారం ఉదయం యంత్ర ప్రతిష్ట, విగ్రహ పత్రిష్ట, ప్రాణప్రతిష్ట, ప్రతిష్టాంగ హవనములు, కళాన్యాసములు, దృష్టికుంభము, బలిహరణము తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పోచబోయిన గణేష్యాదవ్, సభ్యులు హన్మంతరావు, యాదగిరి, రమేష్, రమణమూర్తి, మురళి, రవి, కాయల నాగరాజు, కేశవులు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.