ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలలో దాదాపు 91 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రకటనతో రాష్ట్రమంతా ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయని టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి అన్నారు.
ప్రకటన అనంతరం టీటీయూసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో, తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం ఎదుట కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా మోతె శోభన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలను ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ భర్తీ చేయలేదన్నారు. ప్రాణాలను అడ్డుపెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, అదే స్ఫూర్తితో ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని గుర్తు చేశారు. నిరుద్యోగుల కలలను నిజం చేసేందుకు ఇప్పటికే లక్షా ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో తొంభై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించడం హర్షణీయం.
ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైతే ముక్కు నేలకు రాస్తానని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు ఏమి చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.