సికింద్రాబాద్, సెప్టెంబర్ 14 : ‘బీజేపీది అధికార దాహం.. ఎప్పుడు చూసినా ఆ పార్టీ నేతలు లేని పోని అబద్ధాలను ప్రచారం చేస్తుంటారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ప్రారంభమైన ప్రజాసంగ్రామ యాత్రలో సైతం బండి సంజయ్ తొండి మాటలు మాట్లాడుతున్నారు’.. అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం న్యూ బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బోర్డు మాజీ సభ్యులతో కలిసి జక్కుల మహేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేపట్టిన యాత్రను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
అసలు ఈ యాత్రలో పాల్గొంటున్నది ఈ ప్రాంత వాసులు కాదని.. అందరూ వలసవాదులేనని విమర్శించారు. గురువారం నుంచి కంటోన్మెంట్లో చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. తొండి యాత్ర అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో అమలు కాని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలువుతున్నాయన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సుమారు రూ.800కోట్ల బకాయిల్లో కనీసం రూ.100కోట్లు విడుదల చేయించిన తరువాత కంటోన్మెంట్లో బండి యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ యాత్రతో కంటోన్మెంట్ ప్రజలకు ప్రయోజనం లేదని, రెండేళ్లుగా ఎన్నికలను నిర్వహించలేని స్థితిలో కేంద్రం ఉన్నదని విమర్శించారు. రామన్నకుంట చెరువు, తిరుమలగిరి చెరువు ప్రక్షాళన, బొల్లారం ఆసుపత్రిని ఆధునీకరించడంలో విఫలమైన కేంద్రాన్ని బండి సంజయ్ ప్రశ్నించాలన్నారు.
కంటోన్మెంట్ సమస్యలు తీర్చుతున్న ఏకైక సీఎం కేసీఆర్
గతంలో ఏ పాలకులు కంటోన్మెంట్ను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. బోర్డు పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్, ఆసరా, వితంతు పింఛన్లు, దళితబంధు వంటి పథకాలు అమల్లో ఉన్నాయని, కేంద్ర పథకాలు ఒక్కటి కూడా ఈ ప్రాంతంలో అమలు కావడంలేదని చెప్పడానికే కంటోన్మెంట్లో పాదయాత్ర చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కంటోన్మెంట్ ప్రజలు ఎంతో తెలివైన వారని, బండి అబద్దాలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు లోక్నాథ్, నళినికిరణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.