చంపాపేట, జనవరి 8 : కేంద్రంలో బీజేపీకి మరోసారి అధికారమిస్తే రాజ్యాంగ పీఠిక నుంచి లౌకిక, ప్రజాస్వామ్యవాదాన్ని తొలగించే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు. ఆదివారం చంపాపేట డివిజన్ పరిధిలోని లక్ష్మి కన్వెన్షన్హాల్లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు దక్కాలంటే రాజ్యాంగ పరిరక్షణతోపాటు ప్రపంచ శాంతికి ప్రతిఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరముందన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మేధావులతో చర్చాగోష్ఠి జరగాలన్నారు. ఫిబ్రవరి 11న నగరంలో నిర్వహించ తలపెట్టిన సంఘం 3వ మహాసభలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు కేవీఎల్ నాగేశ్వర్రావు, తిప్పర్తి యాదయ్య, పల్లె వినయ్కుమార్, డీజీ నర్సింహారావు, జేకే శ్రీనివాస్, రఘుపాల్, కూర రమేశ్ తదితరులు పాల్గొన్నారు.