హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): భారతీయుల్లో అపారమైన నైపుణ్యం ఉందని, దేశం గర్వించేలా అంతర్జాతీయస్థాయి ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటుచేసిన సిల్వర్ జూబ్లీ టాక్సిరీస్ను ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సైస్టెనబిలిటీ, స్మార్ట్ సిటీస్లాంటి రంగాల్లో పలు స్టార్టప్స్ రూపొందించిన ప్రయోగాలు, ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధితోపాటు వివిధ అంశాలపై ప్రసంగించారు. పలువురు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు.
మానవ జీవితంలో టెక్నాలజీ అంతర్భాగంగా మారిందని, విద్యార్థులు టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలు చేసేందుకు ముందుకురావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతానికి తెలంగాణ సర్కారు తనవంతు ప్రయత్నం చేస్తున్నదని, ఇందులో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న పేద దేశంగానే ఉందని, దేశం అభివృద్ధిబాట పట్టాలంటే వ్యవసాయరంగంలో టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలు రావాలని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికీ పరిశోధన అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వాలు తకువగా ఖర్చు చేస్తున్నాయని, దీనికి నిధులు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ ఐటీలాంటి ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులు తమ పరిశోధనలు, ఆలోచనలకు మరింత పదును పెట్టాలని సూచించారు. పరిశోధన అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేలా పాఠ్య ప్రణాళికలు, విద్యా బోధన పద్ధతులను మార్చుకొంటే ఈ రంగంలో మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని, ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ అతిపెద్ద కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకొన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో లైఫ్సైన్సెస్ ఎకో సిస్టం రూపుదిద్దుకొన్నదని చెప్పారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లు ఉన్న లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2028 నాటికి 100 బిలియన్ డాలర్లస్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ సర్కారు అభివృద్ధే లక్ష్యంగా పలు పాలసీలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బ్లూ రివల్యూషన్ (చేపల పెంపకం), గ్రీన్ రివల్యూషన్ (పచ్చని పంటలు), పింక్ రివల్యూషన్ (మాంసం ఉత్పత్తి), వైట్ రివల్యూషన్ (పాల ఉత్పత్తి), ఎల్లో రివల్యూషన్ (ను గట్టిగా అమలుచేస్తున్నట్టు చెప్పారు.
వైద్య ఆరోగ్య రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన దేశంనుంచి ఇప్పటివరకూ ఒక్క మాలిక్యూల్ లేకపోవడం శోచనీయమని మం త్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో స్థాపించిన ఐడీపీఎల్ మూత పడిందని, అదే కంపెనీలో పనిచేసిన వారు డాక్టర్ రెడ్డీస్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు పొందారని తెలిపారు. అనంతరం ఫార్మా ఉత్పత్తుల రంగంలో అరబిందో, హెటిరో, ఎంఎస్ఎన్లాంటి కంపెనీలు ఎంతో పేరుగాంచాయని పేర్కొన్నారు. అలాంటి ఐడీపీఎల్ను మూతపడేలా చేశారే తప్ప, పరిశోధనలు చేసి మన దేశం నుంచి ఫార్మా రంగానికి అవసరమైన మాలిక్యూల్స్ను తయారు చేయలేకపోయారని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే ఫార్మా ఉత్పత్తుల రంగంలో తెలంగాణలోని కంపెనీలకు యూఎస్ఎఫ్డీ నుంచి 24 అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇది చాలా చెప్పుకోదగిన విషయమని పేర్కొన్నారు. సమావేశంలో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, సభ్యులు జయేశ్ రంజన్, అజిత్ రంగనేకర్, శ్రీని రాజు, చంద్రశేఖర్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు హాజరయ్యారు.
తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలోని కొహినూర్ రెస్టారెంట్లో తినేందుకు ఎక్కువ ఇష్టపడతానని తెలిపారు. ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ అడిగిన వ్యక్తిగత ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అన్ని భాషల సినిమాలు చూస్తానని, కామెడ్, థ్రిల్లర్, స్పై సినిమాలు అంటే ఆసక్తి ఎక్కువ అని వివరించారు. హాలీవుడ్, బాలీవుడ్, తెలుగు, మలయాళం సినిమాలు చూస్తానని చెప్పారు. మలయాళంలో ఒరిజినల్ కంటెంట్తో కూడిన సినిమాలు ఇష్టమని తెలిపారు. తన పిల్లలకు కుక్కలంటే చాలా ఇష్టమని, ఇంట్లో ఏడు కుక్కలు ఉన్నట్టు వెల్లడించారు.