క్లిష్టతర సమస్యలను పరిష్కరించడంలో స్టార్టప్లు ముందుంటాయి. సరికొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో పనిచేస్తుంటాయి. ఇలాంటి స్టార్టప్లకు పట్టణ ప్రాంతంలో ప్రధాన సమస్యలైన మురుగునీటి శుద్ధి, పారిశుధ్యం, పరిశుభత్రలపై పనిచేసేలా సరికొత్త ఆవిష్కరణల వేదికగా వాష్ (వాటర్, శానిటేషన్, హైజిన్) ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది. పట్టణ పర్యావరణ ప్రగతిని నిర్దేశించే వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నయా ఆవిష్కరణలతో పరిష్కార మార్గాలను చూపేందుకు ఔత్సాహిక స్టార్టప్ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నది.
సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. చక్కటి గాలి, స్వచ్ఛమైన నీరు, నివాసం వద్ద పరిశుభ్రత చాలా ప్రధానం. ఇందులో ఏది తేడా వచ్చినా అనారోగ్యం పాలు గాక తప్పదు. వ్యక్తులే కాదు సమాజ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకే మూడు అంశాల ఆధారంగా సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే వాష్ (వాటర్, శానిటేషన్, హైజిన్) ఇన్నోవేషన్ హబ్. సమస్య ఏదైనా పరిష్కరించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తున్న వారికి వాష్ ఇన్నోవేషన్ హబ్ ఒక వేదికగా మారింది. కేవలం మూడు అంశాలపైనే కేంద్రీకృతమైన వాష్ ఇన్నోవేషన్ హబ్ను ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యంతో ఏర్పాటు చేయగా, దీని సీఈవోగా వెంకట్ చంగవల్లిని నియమించింది. అంతేకాదు నిధుల కొరత రాకుండా ఉండేలా రూ.15 కోట్లను సమకూర్చనుంది.
నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతతోపాటు వ్యర్థాల నిర్వహణ ప్రధాన సవాల్గా మారింది. ప్రజారోగ్యం, పర్యావరణానికి విపరీతమైన హాని కలిగిస్తున్న వీటిని సరికొత్త ఆవిష్కరణలతో అంతమొందించేందుకు ప్రభుత్వం వాష్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ప్రణాళికాబద్ధంగా నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత అంశాలను పర్యవేక్షించేందుకు బహుముఖంగా ఆలోచించి, సమస్యలకు పరిష్కారాలను కనుగొంటారు. టెక్నాలజీ స్టార్టప్ల ఏర్పాటులో ముందువరుసలో ఉన్న హైదరాబాద్లో సామాజిక సమస్యలను సైతం సరికొత్త ఆలోచనలతో పరిష్కరించేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక స్టార్టప్ల నిర్వాహకులకు వాష్ ఇన్నోవేషన్ హబ్ చక్కటి వేదికగా మారనుంది.
కరోనా మహమ్మారితో ప్రజల జీవన విధానంలో అనూహ్య మార్పులొచ్చాయి. ప్రధానంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైరస్ బారిన పడకుండా, ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఎన్నో సలహాలు, సూచనలు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా పరిశుభ్రత, పారిశుధ్యం అత్యంత కీలకం.
నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత అంశాల ప్రాతిపదికగా స్టార్టప్లు ఏర్పాటు చేసే వారి కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. ఖైరతాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ)లో ఏర్పాటు చేసిన వాష్ ఇన్నోవేషన్ హబ్ ద్వారా సరికొత్త ఆవిష్కరణలు చేసేవారిని ప్రోత్సహించి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు వాష్ ఇన్నోవేషన్ హబ్ కృషి చేస్తుందని సీఈవో వెంకట్ చంగవల్లి వెల్లడించారు.