సిటీ బ్యూరో,మార్చి18 (నమస్తే తెలంగాణ): కాలుష్యం కోరల నుంచి ప్రజలను సంరక్షించే కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరత వేధిస్తున్నది.పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాల్సిన కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. పీసీబీలో ఉండాల్సిన సిబ్బంది కంటే సగం మందే ఉండటంతో నగరంలో కాలుష్య, పర్యావరణ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత వేధిస్తుండటంతో కాలుష్య కారకాలను వెదజల్లే పరిశ్రమల్లో తనిఖీలు, శాంపిల్స్ సేకరణలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
వినతులు బుట్టదాఖలు..
సిబ్బందిని పెంచాలని పీసీబీ ఉన్నతాధికారులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు ప్రభుత్వానికి వినతులు అందజేశారు. పీసీబీ ఛైర్మన్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని సమాచారం. ఉన్న కొద్ది మంది సిబ్బందితో ముగ్గురు చేయాల్సిన పని ఒక్కరే చేయాల్సి వస్తున్నదని పీసీబీ అధికారులు వాపోతున్నారు. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణం, ప్రజలకు తీవ్రనష్టం కలిగిస్తున్న పరిశ్రమలు,చెరువులు,నాలాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన కొత్తలో కాలుష్య నియంత్రణ మండలిని సందర్శించిన మంత్రి ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ అది హామీగానే మిగిలిపోయింది.
230 పోస్టులకు విధుల్లో 120 మందే..
ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కాలుష్య నియంత్రణ మండలి అత్యంత కీలకమైనది. పర్యావరణం, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఈ శాఖ పాత్ర ముఖ్యమైనది. అలాంటి పీసీబీలో 230 పోస్టులకు కేవలం 120 మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. ఇందులో సగానికిపైగా 2022 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే భర్తీ చేసింది. ప్రస్తుతం 110 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి అత్యవసరమైన 46 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని పీసీబీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పలుమార్లు లేఖలు, వినతులు రాసినా ఎలాంటి సమాధానం రావడం లేదు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసరమైన పీసీబీ పోస్టులను నింపే ప్రయత్నం చేయడంలేదు. కనీసం అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగులనైనా భర్తీ చేస్తే సమర్థంగా పనిచేయవచ్చని కొంతమంది ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. తమపై పనిభారం తగ్గి పకడ్బందీ తనిఖీలు చేయడానికి వీలుంటుందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి సిబ్బంది కొరతను అధిగమించి కాలుష్య కారకాలైన పరిశ్రమలు, నాలాలపై దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
ముగ్గురి పని ఒక్కరితోనే…
కాలుష్య నియంత్రణ మండలిలో ఉండాల్సిన సిబ్బంది కంటే సగానికి పైగా ఖాళీలు ఉండడంతో పని ఒత్తిడి పెరుగుతున్నదని ఉద్యోగులు వాపోతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో రెండు జోనల్ కార్యాలయాలు బేగంపేటలో ఒకటి, రామచంద్రాపురంలో ఒకటి ఉన్నాయి. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కలిపి 10 రీజినల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యంగా ఏఈ, ఏఈఎస్ పోస్టులు ఎక్కువ ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో పరిశ్రమలు, కాలుష్యం విడుదలయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లోని జోనల్, రీజినల్ కార్యాలయాల్లో ఏఈ, ఏఈఎస్లు ముగ్గురు ఉంటేనే పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏఈ, ఏఈఎస్లు ఒక్కొక్కరే ఉన్నారు.
దీంతో ముగ్గురు చేయాల్సిన పని ఒక్కరే చేయాల్సి వస్తున్నది. రూరల్ ప్రాంతాల్లో పరిశ్రమలు, కాలుష్యం విడుదల తక్కువగా ఉండటంతో కనీసం రెండు ఏఈ, ఏఈఎస్ పోస్టులు ఉండాలి కానీ.. ఆయా రీజినల్ కార్యాలయాల్లో కూడా ఒక్కొక్కరే ఉండటంతో పని ఒత్తిడి పెరిగి కాలుష్య నియంత్రణ పూర్తిస్థాయిలో జరగడం లేదని తెలుస్తున్నది. కాలుష్య నియంత్రణ మండలి స్వయం ప్రతిపత్తి సంస్థ కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తే వేతనాలు బోర్డు నుంచే ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కీలకమైన పీసీబీ అచేతన స్థితిలోకి జారుకుంటున్నది.