పీహెచ్బీ కాలనీ, నవంబర్ 24 : జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం జోన్ ఆఫీస్లో ఇంజినీరింగ్, యూబీడీ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెంగుళూరు తరహాలో జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందన్నారు.
జోన్లోని ఐదు సర్కిళ్లలో సర్కిల్కు ఒకటి చొప్పున ఐదు జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే గాజులరామారం సర్కిల్లోని ఐడీపీఎల్ జంక్షన్, కుత్బుల్లాపూర్ సర్కిల్లోని కృష్ణకుంజ్ జంక్షన్ల అభివృద్ధి పనులు ప్రారంభించగా మిగిలిన సర్కిళ్లలో జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రెండు జంక్షన్లలో చేపట్టాల్సిన పనులు, ఆయా విభాగాలు చేయాల్సిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జంక్షన్లలో విస్తరణ, అభివృద్ధి, వాకింగ్ ట్రాక్, సిగ్నల్స్ ఏర్పాటు, పచ్చని మొక్కలతో సుందరీకరణ పనులు చేయాల్సి ఉందన్నారు. ఎంపికైన జంక్షన్లలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనదారులకు, బాటసారులకు వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ పద్మనాభం, సిటీ ప్లానర్ ఉమాదేవి, ఈఈలు సత్యనారాయణ, గోవర్దన్ గౌడ్ తదితరులున్నారు.