సనత్నగర్ : సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(Mla Talasani Srinivas Yadav) పేర్కొన్నారు. బుధవారం మారేడ్పల్లిలోని తన నివాసంలో జరిగిన జీహెచ్ఎంసీ(GHMC), జలమండలి అధికారులతో కలిసి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.
జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. నియోజకవర్గం పరిధిలోని హమాలీబస్తీ, రామస్వామి కంపౌండ్, సజ్జన్లాల్ స్ట్రీట్ ప్రాంతాల్లో సివరేజీ, మంచినీటి పైపులైన్ల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయని వివరించారు. పనులను పూర్తి చేస్తే ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన రోడ్లు, ఫుట్పాత్ పనులను పూర్తి చేయాలని సూచించారు.
బేగంపేట్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీలోని గ్రేవ్ యార్డ్ నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్త పనులకు టెండర్ ప్రక్రియలను చేపట్టి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ ఈఈ సుదర్శన్, జలమండలి సీజీఎం ప్రభు, డీజీఎం వశాంక్, సురేష్, సంధ్యారాణి తదితరులున్నారు.