సిటీబ్యూరో, మే 30(నమస్తే తెలంగాణ): మహా నగరంలో నిరంతర సేవకులకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మూడో రోజైన ఆదివారం 22,603 మందికి టీకాలు వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం ప్రారంభమైన మొదటి రోజు 21,666 మందికి, శనివారం 22,399 మందికి వ్యాక్సిన్ అందించారు. మూడు రోజులకు గాను 66,668 మంది నిత్య సేవలకు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను సద్వినియోగం చేసుకున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కొవిడ్ నిబంధనలతో సజావుగా సాగుతున్నది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను పలువురు ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.