చర్లపల్లి, నవంబర్ 16 : టీఎస్ ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో జీరో ఆక్సిడెంట్ల లక్ష్యం సాధించేందుకు డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని టీఎస్ ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ యుగంధర్ పేర్కొన్నారు. మంగళవారం కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా డ్రైవర్లు వాహనాలను నడపాలని సూచించారు. బస్సులను జాగ్రత్తగా నడుపుతూ.. ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలని డ్రైవర్లకు సూచించారు. సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో పన్నెండు డిపోల్లో.. సుమారు 3,400 డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారని, వీరు ఎలాంటి యాక్సిడెంట్లు చేయకుండా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా డ్రైవర్లు అప్రమత్తంగా బస్సులు నడపాలని, రోడ్లపై ఎవరైనా ఇబ్బంది కల్గిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం కుషాయిగూడ, చెంగిచెర్ల డిపో మేనేజర్లు సుధాకర్రావు, యేసులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు శ్రీపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.