సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఒక వైపు వాణిజ్య సముదాయాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతూనే మరో వైపు వ్యాపారస్తులకు అగ్ని ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే హోటళ్లు, ఇంటీరియర్ ఫర్నిచర్ మాల్స్, పలు వాణిజ్య సముదాయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ఈ డ్రైవ్లో ఎక్కువ శాతం సెల్లార్లను డంపింగ్ కేంద్రాలుగా మార్చుతున్నట్లు తేలింది. ఓపెన్ ఏరియాలో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్లను సెల్లార్లోనే కొనసాగిస్తున్నారు. ఫర్నిచర్ షాపు నిర్వాహకులు ఎక్కువ శాతం సెల్లార్లోనే సామగ్రితో నింపేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఈవీడీఎం విభాగం అధికారులు సంబంధిత వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం సికింద్రాబాద్ ఫ్యారడైజ్ హోటల్, త్రిస్టార్ హోటల్, బంజారాహిల్స్లోని ఇంటీరియర్ ఫర్నిచర్ షోరూమ్లో తనిఖీలు చేశారు. ఇటీవల కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న 15 వ్యాపార సముదాయాలకు నోటీసులు జారీ చేశామని,15 రోజుల గడువు ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఈవీడీఎం విభాగం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందేనని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.