ఖైరతాబాద్, ఏప్రిల్ 9 :అరాచక పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని బీజేపీని గద్దెదించేందుకు అన్ని పక్షాలు కలిసి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు, ది ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ‘మోదీ హటావో, దేశ్ బచావో’ నినాదంతో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా వివక్ష చూపించారని, కోచ్ ఫ్యాక్టరీకి నో చెప్పారని, పసుపు బోర్డు వాగ్దానాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. ఐటీఆర్ ప్రాజెక్టు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసేత్తడం లేదని అన్నారు.
రాష్ట్రం నుంచి కేంద్ర ఖజానాకు వెళ్తున్న నిధుల నుంచి కూడా మన రాష్ర్టానికి చెందిన వాటాలను ఇవ్వడంలో వివక్ష చూపుతుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం అవసరమా..?అని ప్రశ్నించారు. బీజేపీని గద్దె దించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ‘మోదీ హటావో, దేశ్ బచావో’ నినాదానికి పిలుపునిచ్చామని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని పక్షాలు ఏకం కావాలని కోరారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రధానిగా వ్యవహరించడం లేదని, ఒక పార్టీకి చెందిన నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకురాలు ఎస్ఎల్ పద్మ మాట్లాడుతూ ఆప్ నినాదాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని, అందులో తమ పార్టీ భాగస్వామ్యమవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆప్ కోర్ కమిటీ సభ్యులు భూక్యా శోభన్బాబు, బుర్ర రాములు గౌడ్, అబ్దుల్ ముక్తాదీర్, డాక్టర్ సోలమన్ రాజు, డాక్టర్ హరిచరణ్, పాండురంగయ్య, వికాస్ రెడ్డి, రణదీర్ సింగ్ రాణా, మహ్మద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.