బంజారాహిల్స్, మార్చి 8: యాభయ్యేళ్ళ క్రితం వచ్చిన గుండమ్మ కథ సినిమాలో ‘లేచింది మహిళా లోకం.. నిద్ర లేచింది మహిళా లోకం’ అని వచ్చిన పాట నేడు వాస్తవ రూపం దాల్చిందని, అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలు రాణిస్తున్నారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఎన్ఎస్ఐ గ్లోబల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 55 మంది మహిళలకు ‘మహిళా స్ఫూర్తి గౌరవం’ అవార్డులు అందజేశారు. బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్లో ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పురుషులతో సమానంగా నేడు మహిళలు దేశాన్ని ఏలుతున్నారన్నారు. మన దేశంలో మహిళలకు ప్రస్తుతం గౌరవం లభిస్తున్నదన్నారు. మహిళా నేతలైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్, సుష్మా స్వరాజ్ తదితరుల చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కృషి చేస్తున్నదని, మహిళా పారిశ్రామిక విధులకు సహకారం అందిస్తున్నదన్నారు.
ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ, వివిధ రంగాలలో మహిళలను గుర్తించి అవార్డులు ఇవ్వడం సంతోషకరమన్నారు. తన జీవితంలో అమ్మపాత్ర గొప్పవని గుర్తు చేసుకునన్నారు. పోలీస్ శాఖలో సైతం ఇటీవల కాలంలో మహిళా అధికారులు పెరుగుతున్నారని.. ఎన్నో సవాళ్ళతో కూడుకున్న రంగమైనా పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారిణులు విధి నిర్వహణలో మందంజలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ గ్లోబల్ కౌన్సిల్ అధినేత నవాబ్ షేక్ ఇబ్రహీం, అజయ్ మిశ్రా, అద్దంకి దయాకర్, సందీప్ జైన్ తదితరులు పాల్గొన్నారు.