కాచిగూడలో చేనేత చీరలు
ఒక్కో రైల్వే స్టేషన్లో ఒక్కో ఉత్పత్తి విక్రయం
సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్లో ఏర్పాటు
‘వన్ స్టేషన్ – వన్ ప్రొడక్ట్’ పేరుతో
అమ్మకాలు ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
సిటీబ్యూరో, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ)/ కాచిగూడ: స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ప్రయత్నానికి అడుగులు వేసింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలోని ఆరు స్టేషన్లలో ‘వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్’ పేరుతో ప్రయాణికుల సౌకర్యార్థం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, కాచిగూడ, ఔరంగాబాద్, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో శనివారం వీటిని ప్రారంభించారు. ఈ ఐదు స్టేషన్లలో తొలిసారిగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటికే గత నెలలో తిరుపతి రైల్వే స్టేషన్లో స్థానిక ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అది విజయవంతమైందని రైల్వే అధికారులు తెలిపారు.
అదే స్ఫూర్తితో మిగతా ఐదు రైల్వే స్టేషన్లలో కూడా స్థానిక హస్త కళాకారులు, కుమ్మరి, చేనేత/వస్త్ర కళాకారులు, గిరిజనులు వంటి వారికి జీవనోపాధి కలిగించడంతో పాటు సంక్షేమాన్ని మెరుగుపరుచడం, స్థానిక పరిశ్రమలను బలోపేతం చేయడానికి రైల్వే ప్రోత్సహిస్తుందన్నారు. అయితే, రైల్వే అధికారుల ఆదేశాల మేరకు కార్యక్రమంలో భాగంగా కాచిగూడ రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం-1లో పోచంపల్లి చేనేత వస్ర్తాలయాన్ని శనివారం డీసీఎం యు.జనార్దన్, కాచిగూడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ బస్వరాజ్ ప్రారంభించారు.