Sowmya Janu | బంజారాహిల్స్, మార్చి 6: రాంగ్రూట్లో రావడమే కాకుండా.. అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డుపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలో నటి సౌమ్యా జాను అలియాస్ షేక్ జాన్బీ (34)ని బుధవారం బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 24న సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని కళింగ భవన్ చౌరస్తాలో వేగంగా జాగ్వార్ కారులో వచ్చిన సౌమ్యా జానును అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు విఘ్నేష్ అడ్డుకున్నాడు. రాంగ్రూట్లో వస్తే ప్రమాదం చోటు చేసుకుంటుందని, వెనక్కి వెళ్లాలని సూచించాడు.
దీంతో వాగ్వాదానికి దిగిన సౌమ్య.. అతడిని తీవ్రమైన పదజాలంతో దూషించింది. అతడి వద్ద నుంచి సెల్ఫోన్ లాక్కోవడంతో పాటు దాడికి దిగింది. దీంతో తన విధులకు అంతరాయం కల్పించడంతో పాటు దాడికి పాల్పడిన సౌమ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. హోంగార్డు విఘ్నేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న సౌమ్యను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆమె దుబాయి వెళ్లినట్లు గుర్తించారు.
ఆమెను రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగానే.. తనను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో బుధవారం సౌమ్యా జానును పోలీసులు విచారించి.. ఈ ఘటనపై ఆరా తీశారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని, తాను రాంగ్రూట్లో రావడం తప్పేనని సౌమ్య అంగీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జాగ్వార్ కారు తనది కాదని, తన స్నేహితుల కారులో వెళ్తున్న క్రమంలో ఘటన జరిగిందన్నారు. విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు చెబుతానని పేర్కొంది.