సికింద్రాబాద్, నవంబర్ 13: కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే శనివారం ఎమ్మెల్యే సాయన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కంటోన్మెంట్కు చెందిన పలు సమస్యలు, అంశాలు మంత్రి కేటీఆర్కు వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్లో కచ్చితంగా 20వేల లీటర్ల తాగునీటి సరఫరాను ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉచిత తాగునీటికి వెంటనే బడ్జెట్ అంచనాలు రూపొందించి నివేదికను త్వరగా తనకు అందజేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ను ఆదేశించారు. ఇప్పటికే బడ్జెట్లో ప్యాట్నీ కంపౌండ్ నిర్మాణం, ఆధునీకరణకు సుమారు రూ.10 కోట్లను మంజూరు చేశామని, దీనికి సంబంధించి త్వరలో టెండర్లు సైతం పిలిచే ప్రక్రియను వేగవంతం చేయాలని ఓఎస్డీకి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో మిగిలిన 50 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో జాప్యంపై జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిలియన్ ఏరియాలను జీహెచ్ఎంసీలో కలిపే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని మంత్రి స్పష్టం చేశారు. డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 15వ తేదీ తరువాత ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవాలని ఎమ్మెల్యే సాయన్నకు మంత్రి సూచించారు. త్వరలోనే మరోమారు కంటోన్మెంట్కు చెందిన సమస్యలపై పూర్తిస్థాయిలో ఓ సమావేశాన్ని నిర్వహించి వాటి పరిష్కారాలకు కృషి చేద్దామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మంత్రి కేటీఆర్ చెప్పడంతో ఎమ్మెల్యే సయన్న మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి రానున్నట్లు ఆయన చెప్పారు.