హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కొండాపూర్ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సీఎస్ కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టిన పనులను పరిశీలించారు. ఆసుపత్రి భవన ప్రాంగణమంతా కలియ తిరిగారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిని అధికారులు సీఎస్కు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రహేజా గ్రూప్ సంస్థ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల అభివృద్ధికై చొరవ తీసుకున్నది. తన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది. ఆసుపత్రిని పూర్తి స్థాయి మౌలిక వసతులు, మానవ వనరులతో నిర్వహించడానికి వీలుగా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.