నోట్ల సెక్యూరిటీ కోసం 17 అంశాల్లో ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకుంది. అన్ని విషయాలు సామాన్య పౌరులకు తెలిసే అవకాశ ముండదు. కనీసం అందులో కొన్నిఅంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. నోటు క్వాలిటీ, నోటు నలుమూలలా సరిగ్గా ఉండాలి. నోటుపై ఉండే గీతలు చేతికి తగలాలి. నోటుపై ఉండే ప్లవర్లో 500 అని రాసి ఉండాలి. సెక్యూరిటీ థ్రెడ్ (దారం) ఒక్కటే ఉంటుంది. గాంధీ బొమ్మ పక్కన 500 అని రాసి ఉంటుంది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): నకిలీ నోట్లు చెలామణి చేస్తూ ఒకటికి మూడు రూపాయలు సంపాదించేందుకు కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా కొనసాగించిన దర్యాప్తులో సంచలనాత్మకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ నోట్లను చెలమణి చేసేందుకు ప్రధాన నిందితులు ఏజెంట్లను నియమించుకొని వాటి ద్వారా మార్కెట్ చేస్తున్నారు. ఇలా అనధికారికంగా రెండు మూడు కోట్ల వరకు నకిలీ నోట్లు రెండు తెలుగు రాష్ర్టాలలో చెలామణి అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. తమ ఏజెంట్లకు దఫ దఫాలుగా నకిలీ నోట్లను ప్రధాన నిందితులు అందజేస్తున్నారు. ఈ నకిలీ నోట్ల వ్యవహారంపై ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు. చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకొని నకిలీ నోట్లు ఎక్కువగా చెలామణి అవుతుండటంతో వారిలో నకిలీ నోట్ల విషయంలో అవగాహన కల్పించనున్నారు. నకిలీ నోట్ల తయారీతో పాటు నకిలీ నోట్ల మార్కెట్కు కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లను నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. దీంతో ఇలాంటి వారి విషయంలో సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు అలాంటి సమాచారం గుర్తిస్తే పోలీసులకు తెలుపాలని అధికారులు సూచిస్తున్నారు.
సైబరాబాద్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 13 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠాకు సరఫరా అవుతున్న నకిలీ నోట్లు బాండ్ పేపర్ను ఉపయోగించి తయారు చేసిన నకిలీ నోట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ నోట్ల తయారీని అవసరాన్ని బట్టి ఈ ముఠా తయారు చేస్తూ, ముందుగా తయారు చేసినవన్ని మార్కెట్లోకి వెళ్లిన తరువాత కొత్తవి ప్రింట్ చేస్తున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాలను ఎక్కువగా అవకాశంగా తీసుకుంటున్నారు. నకిలీ నోట్లను గుర్తించేందుకు తగిన నైపుణ్యం లేని ప్రాంతాలను గుర్తించి అక్కడే చెలామణి చేస్తున్నారు.
అసలైన నోట్ల మాదిరిగానే నకిలీ నోట్లను తయారు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. చిన్న కిరాణ దుకాణాలు, వారంతాపు మార్కెట్లు, పాన్ షాప్లు, గ్రామాల్లోని మద్యం దుకాణాలు, పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, మనీ ట్రాన్స్ఫర్ దుకాణాలు, ఇంటర్నెట్ సెంటర్స్, పాల దుకాణాలు, ఈవెంట్స్, కాలేజీ ఫెస్ట్స్, స్క్రాప్ షాప్స్, పుష్కార్ట్స్, లేబర్ అడ్డాలను లక్ష్యంగా చేసుకొని ఈ నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారు.
– సైబరాబాద్ సీపీ, స్టీఫెన్ రవీంద్ర