కవాడిగూడ : కవాడిగూడ ఎంసీహెచ్ క్వార్టర్స్ బస్తీ వాసుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం కవాడిగూడ డివిజన్లోని మున్సిపల్ క్వార్టర్స్ బస్తీలో ‘బస్తీవాసులు-బస్తీ సమస్యలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తమ ఇండ్లను 58 జీఓ ద్వారా క్రమబద్దీకరించి డబుల్ ఇండ్లను నిర్మించాలని, అదే విధంగా ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని, బస్తీలో సరైన నీటి వసతి లేదని, మాజీ కార్పొరేటర్ లాస్య నందిత, ఎమ్మెల్సీ ప్రభాకర్ సహకారంతో తమ బస్తీలో పవర్ బోర్ వేయించారని, ఇప్పటి వరకు వాడుకలోకి తీసుకురాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
అదే విధంగా బస్తీని పరిశుభ్రంగా ఉంచడానికి ఒక స్వీపర్ను పెట్టాలని బస్తీ వాసులు కనకం విజయమ్మ, మణెమ్మ, సురేఖ, వి. రాధ, శాలిని, జహదాబేగం, ఉమా, రషీదాలు ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ రచనశ్రీలు బస్తీ వాసులు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమస్యల ను త్వరితగతిన పరిష్కరించి స్థానికుల ఇబ్బందులు తొలగిస్తామని అన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఎ. శంకర్ గౌడ్, శ్రీహరి, కృష్ణ, బీజేపీ కవాడిగూడ అధ్యక్షుడు మహేందర్ బాబు, దిశ కమిటీ సభ్యుడు జి. వెంకటేశ్, బస్తీ నాయకులు లక్ష్మణ్, ప్రవీణ్ గౌడ్ తదితర మహిళలు పాల్గొన్నారు.