మేడ్చల్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వరద నీటి సమస్యకు మోక్షం కలగనున్నది. తిరిగి ఈ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు రచించగా.. ఈ మేరకు అధికారులు వరద కాలువ పనులు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో వరదనీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.110 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు సర్వే పనులు పూర్తి చేయగా.. పనుల ప్రారంభానికి టెండర్లు పిలిచేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
ముంపులేకుండా..
భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ల పరిధిలో సుమారు 60 కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన అధికారులు వరద నీరు సాఫీగా వెళ్లేలా కాలువలు నిర్మించనున్నారు. ముందుగా చెరువులోకి వరదను పంపి.. ఆ తర్వాత మూసీలోకి మళ్లించనున్నారు.
మళ్లింపు ఇలా..
కాలనీల్లో చేరిన వర్షం నీటిని ముందుగా వరద కాలువల ద్వారా చెరువుల్లోకి పంపనున్నారు. లింక్ కలిపి ఒక చెరువు నుంచి మరో చెరువులోకి వరదను చేర్చి చివరగా మూసీలోకి విడుదల చేయనున్నారు. ముఖ్యంగా పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ల పరిధిలో పిర్లకుంట నుంచి అల్మాస్కుంట (1.05 కిలోమీటర్లు),అల్మాస్ కుంట నుంచి పెద్ద చెరువు (2.01), పెద్ద చెరువు నుంచి పోచమ్మ కుంట(1.54), పోచమ్మ కుంట నుంచి మూసీ వరకు (1.04), పోచమ్మ చెరువు నుంచి చింతల చెరువు(1.16), చింతల చెరువు నుంచి మేడిపల్లి చెరువు (1.10), మేడిపల్లి చెరువు నుంచి మూసీ వరకు (2.04) 8 ఫీట్ల వెడల్పుతో వరద కాలువలను నిర్మించనున్నారు. అవసరం ఉన్న చోట మరింత వెడల్పు పెంచే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
త్వరలో పనులు ప్రారంభం
పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ల పరిధిలో వరద కాలువల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు మంజూరు చేసింది. పనుల ప్రారంభానికి సాంకేతిక అనుమతి లభించింది. ఈ పనులు పూర్తి అయితే భవిష్యత్లో కాలనీల్లో ముంపు అన్న సమస్యే ఉండదు.
-మంత్రి మల్లారెడ్డి
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ముంపు సమస్య లేకుండా చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరద కాలువలకు నిధులు మంజూరు చేయించారు. నిధులు మంజూరు కావడంతో ఎన్నో సంవత్సరాలుగా ముంపును ఎదుర్కొంటున్న కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పనుల ప్రారంభానికి త్వరలో టెండర్లు పిలుస్తాం.