నగరంలో ట్రెండ్ మారుతున్నది. పచ్చదనం.. పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించగా.. నగర వాసులు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగస్వాములవుతున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల వాతావరణం కాలుష్యమవుతుండటంతో దానికి చెక్ పెట్టేందుకు ‘ఇండ్లపై సోలార్, ఇంటి కింద ఎలక్ట్రిక్ వాహనం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 8వేలకు పైగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఉండగా 25వేల వరకు ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. మరో రెండుమూడేండ్లలో 50 శాతానికి పైగా సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): నగరంలో క్లీన్ సిటీ.. గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయి. అమాంతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భారం కావడంతో పాటు వాయు కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. దీంతో నగర వాసులు ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించారు. నగరంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా ఇండ్లపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. ఇది ప్రతియేటా క్రమంగా పెరుగుతున్నది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు 8వేలకు పైగా ఉండగా, ప్రతి రోజు 150 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ వాహనాల సంఖ్య 2019-2020 నాటికి 11,500 ఉండగా.., ఏడాదిలో 23 శాతం వృద్ధి రేటులో 25 వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్ల మీదకు వచ్చాయి. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న ఈ ట్రెండ్ 2-3 ఏండ్లలో ఒక్కసారిగా మారిపోయి కార్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 50 శాతానికి పైగా విద్యుత్ వాహనాలే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇక పచ్చదనం కోసం నగరంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగుతుండగా, పట్టణ ప్రగతి పేరుతో పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారు.
పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల ద్వారా 27శాతం వాయు కాలుష్యం ఏర్పడుతున్నది. ఇందులో ఎంతో హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ 75 శాతం వరకు ఉంటుంది. వాటి స్థానంలో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం వల్ల వాయు కాలుష్యం సున్నాగా ఉంటుంది. ఇదే అంశం నగర వాసులను ఆలోచింప చేసింది. కొంచెం ఖర్చయినా.. సోలార్ ప్లాంట్లు, విద్యుత్ వాహనాల వినియోగం వైపు మొగ్గు చూపుతున్నారు.
అందుకు నిదర్శనమే పెరుగుతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యనే. ఇంటిపైన సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకొని ఇంటి కింద విద్యుత్ వాహనాల కోసం చార్జింగ్ చేసుకునే ట్రెండ్ క్రమంగా పెరుగుతున్నది. దీనికి సంబంధించిన మౌలిక వసతులను విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్న కంపెనీలే కల్పిస్తున్నాయి. ఇది రాబోయే 2-3 ఏండ్ల లో మరింత విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతుందని విద్యుత్, ఆటోమొబైల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
కరోనా కష్ట కాలంలోనూ కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతంగా పెంచుతూ పోతుండటంతో వాహనదారులంతా ఆలోచనలో పడ్డారు. పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయ మార్గమైన విద్యుత్ వాహనాలను వినియోగించాలన్న ఆసక్తి పెరిగింది. ఆ కారణంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహనాల అమ్మకాలు పెరిగి, వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రజల్లో విద్యుత్ వాహనాల పట్ల ఆసక్తి పెరగడంతో పలు కంపెనీలు సైతం రకరకాల మోడల్స్ను తయారు చేసి విక్రయిస్తున్నాయి.
ప్రస్తుతం విరివిగా వినియోగిస్తున్న ఇంధన వనరులతో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి, ప్రత్యామ్నాయంగా ఉన్న గ్రీన్ ఎనర్జీపై అవగాహన పెంచుకుంటున్నారు. వీటికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసినా, విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేసినా భారీ మొత్తంలోనే సబ్సిడీ ఇస్తుండటంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా పర్యావరణ పరిరక్షణకు మేలు జరిగేందుకు అవకాశం ఉందని, భవిష్యత్తు అంతా విద్యుత్ వాహనాలదేనని అభిప్రాయాన్ని రవాణా రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం అయిప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకోసం సహజ సిద్ధంగా విద్యుత్ ఉత్పత్తికి సోలార్ ఎనర్జీ కీలకంగా మారింది. సొంత ఇల్లు ఉన్న ఎవరైనా ఇంటిపైనే సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసుకొని విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఏర్పాటు చేసినప్పుడు అయ్యే ఖర్చు తప్ప, ఆ తర్వాత పెద్దగా ఖర్చే ఉండదు. పైగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ సైతం వస్తుంది.
దీంతో 5 కిలో వాట్ల సోలార్ విద్యుత్ యూనిట్ను ఇంటిపై భాగంగా 100 -150 చదరపు అడుగుల స్థలంలోనే ఏర్పాటు చేయవచ్చు. సుమారు రూ.4-5 లక్షలు ఖర్చు అవుతుండగా, అందులో రూ. 2లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. ఇంటిపై సోలార్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆ ఇంటికి సరిపోయే విద్యుత్తో పాటు మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి తిరిగి విక్రయించే అవకాశం ఉంది. దీనివల్ల సహజసిద్ధమైన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగి పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. – మోహన్ సాయి, ఆర్కిటెక్ట్, లంగర్హౌస్