సిటీబ్యూరో, జులై 1(నమస్తే తెలంగాణ): అప్పుల నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ స్నాచింగ్ డ్రామా ఆడింది. పోలీసుల దర్యాప్తులో అది కట్టుకథ అని తేలింది. ఈ సంఘటన ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే…ఎల్బీనగర్ ఎస్బీహెచ్ కాలనీకి చెందిన ఓ మహిళ.. గత నెల 28న రాత్రి 8.30 గంటలకు గొలుసు దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు.. అక్కడ స్నాచింగ్ జరిగిన దృశ్యాలు కనపడలేదు… అయితే.. అప్పుడు ఆ మహిళ సాఫీగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం కనపడింది.. అలాగే.. ఆమె ఇంటి నుంచి బయలుదేరిన ప్రాంతం నుంచి..తిరిగి ఇంటికి చేరుకున్న ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించారు.. అక్కడ ఎక్కడ కూడా స్నాచింగ్ జరిగిన దృశ్యాలు కనపడలేదు.. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని నిలదీయగా… స్నాచింగ్ జరగలేదని తేలింది. తనకు అప్పులు అయ్యాయని, వాటి నుంచి బయటపడేందుకు బంగారాన్ని ఓ పాన్ బ్రోకర్ వద్ద గిరివి పెట్టానని … ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే గొడవలు జరుగుతాయని భావించి.. వాటిని నుంచి తప్పించుకునేందుకు స్నాచింగ్ డ్రామా ఆడినట్లు ఒప్పుకుంది. ఈ తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు రెండు రోజుల పాటు కలవరానికి గురై.. ఉరుకులు, పరుగులు పెట్టారు. ఫిర్యాదు తప్పని తేలడంతో.. బాధిత మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.