సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఒడిశా కేంద్రంగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తితో పాటు నగరంలో గంజాయి విక్రయిస్తున్న మరో వ్యక్తిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 20 వేల విలువజేసే రెండు కిలోల గంజాయి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన కైబర్త గిరిధారి (38) హమాలీ. సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి స్మగ్లింగ్ను ఎంచుకున్నాడు. 2009 నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు తన స్వస్థలం నుంచి గంజాయి సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నగరంలోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన నల్ల రోహిత్ కుమార్తో పరిచయం ఏర్పడింది. రోహిత్ స్థానికంగా గంజాయి విక్రయిస్తుంటాడు.
రోహిత్కు సైతం గిరిధారి రూ.10 వేలకు కిలో చొప్పున గంజాయి సరఫరా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే రోహిత్ కుమార్ నుంచి రూ.10 వేలు అడ్వాన్స్గా తీసుకున్న గిరిధారి, ఇటీవల ఒడిశాకు వెళ్లి, అక్కడ కిలో రూ.2,500 చొప్పున రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి, నగరానికి తీసుకొచ్చాడు. అనంతరం శుక్రవారం ఉదయం మేడ్చల్, రేకుల బావి చౌరస్తా వద్ద గంజాయిని రోహిత్కు అందజేస్తుండగా అప్పటికే సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టి నిందితులిద్దరినీ పట్టుకుని, అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును మేడ్చల్ పోలీసులకు అప్పగించారు.