బంజారాహిల్స్, జనవరి 17: తన వద్ద బంగారు కడ్డీలు ఉన్నాయంటూ నమ్మించి తక్కువ ధరకు అమ్ముతానంటూ బురిడీ కొట్టించేందుకు యత్నించిన ఓ మోసగాడిని అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన ఓ వ్యాపారి పోలీసులకు అప్పగించిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. టోలీచౌకి సమీపంలోని అరవింద్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారి అబ్దుల్లా ఇబ్రహీంకు ఈనెల 6వ తేదీన రాజస్థాన్కు చెందిన ఇనాముల్ హసన్(30) అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తన వద్ద 8 కేజీల బంగారం ఉందని, దాన్ని కేవలం రూ.2కోట్లకే అమ్ముతానంటూ చెప్పాడు. తన వద్ద అంత డబ్బు లేదని, తనకు ఫోన్ చేయొద్దని సమాధానం ఇచ్చాడు.
అయినా వినకుండా పలుమార్లు ఇనాముల్ హసన్ ఫోన్లు చేస్తుండటంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి ఇనాముల్ హసన్ ఫోన్ చేశాడు. తాను హైదరాబాద్కు వచ్చానని, తన వద్ద ఒక కేజీ బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పాడు. దీంతో అతడిని ఎలాగైనా పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్న అబ్దుల్లా ఇబ్రహీం అతడితో బేరం చేయసాగాడు. తాను నాణ్యత పరీక్ష చేసిన తర్వాతే కొంటానంటూ మెలికపెట్టాడు. దీంతో గురువారం రాత్రి రెండు బంగారం బిస్కెట్లు తీసుకువచ్చిన ఇనాముల్ హసన్ వాటిని పరీక్షించుకోవాలని చెప్పాడు. ముందుగా తనకు రూ.15లక్షలు చూపించాలని, నాణ్యత పరీక్ష చేసిన తర్వాత రూ.15లక్షలు ఇవ్వాలని చెప్పడంతో కొంత డబ్బును సైతం తనతోపాటు తీసుకువచ్చిన అబ్దుల్లా తన ఆఫీసులో సీసీ కెమెరాలు ఉంటాయని, ఇంటికి వెళ్లిన తర్వాత చెక్ చేసుకుని బంగారం బిస్కెట్లు కొంటానంటూ కారులో ఎక్కించుకున్నాడు.
అతడిని కారులో ఎక్కించుకుని నేరుగా ఫిలింనగర్ పోలీస్స్టేషన్లోకి తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించడంతో ఇనాముల్ హసన్ అవాక్కయ్యాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. అప్పటికే అక్కడున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న బిస్కెట్లు నకిలీవని, బంగారం బిస్కెట్ల పేరుతో అందిన కాడికి దోచుకుని ఉడాయించే క్రమంలో గురువారం ఉదయమే ఇనాముల్ హసన్ రాజస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై బీఎన్ఎస్ 318(4), రెడ్విత్ 62 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన వ్యాపారి అబ్దుల్లా ఇబ్రహీంను పోలీసులు అభినందించారు.