కీసర, మే 3: ఓ ప్లాట్కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో ఆరుగురిపై కేసు నమోదైన ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు కథనం ప్రకారం.. కీసర పోలీస్స్టేషన్ పరిధి రాంపల్లిలోని సర్వేనెంబర్ 404, 405లోని ప్లాట్ నెం.108లోని 300 గజాల ప్లాట్ను నిజాంపేట్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి రవీంద్ర 1983లో కొనుగోలు చేశాడు. ఈ ప్లాట్ను సొంతం చేసుకోవడానికి నిందితులు అసలు యజమాని లేరని భావించి నకిలీ లింక్ డాక్యుమెంట్ నెంబర్ సృష్టించి డాక్యుమెంట్ రైటర్ ఉదయ్రెడ్డి, అప్పటి సబ్ రిజిస్ట్రార్ రెహమాన్తో కుమ్మకై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి పలుమార్లు అమ్మిన్నట్లు బయటపడింది.
ఈ క్రమంలో ఆ ప్లాట్కు నకిలీ ఓనర్గా ఉన్న ధర్మారావును సృష్టించి అతను ప్రదీప్కుమార్కు, ప్రదీప్కుమార్ ఆ ప్లాట్ను రెండుగా విభజించి ప్రభాకర్, నరేశ్ అనే వ్యక్తులకు తరువాత వారిద్దరు కలిసి గుబ్బల వెంకటేశ్వర్రావు, (జీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కు రిజిస్ట్రేషన్ చేస్తూ చివరికి వారు కలిసి జంగాల శ్రీరామ్, అతని భార్య విజయలక్ష్మీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కేసులో నిందితులంతా ఒక గ్రూప్గా మారి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నకిలీ డాక్యుమెంట్ ద్వారా ప్లాట్స్ను కబ్జా చేసి అమాయకులకు అమ్మి మోసం చేస్తున్నామని నిందితులు ఒప్పుకున్నారు.
ఈ కేసులో నిందితులైన జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వర్రావు, బందెల్ల ప్రభాకర్, పోన్నబోయిన బాలకృష్ణ, డాక్యుమెంట్ రైటర్ ఉదయ్రెడ్డిలను కీసర పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నకిలీ ప్లాట్ డాక్యుమెంట్ కేసులో సమగ్ర విచారణ జరిపిన జవహర్నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు, ధర్యాప్తు అధికారి అనిల్కుమార్, కీసర పోలీసు సిబ్బందిని మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ సీఎచ్ శ్రీధర్ అభినందించారు.