సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్/కంటోన్మెంట్ : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్ల నాలుగు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటలపాటు శ్రమించి 13 మందిని బయటకు తీసుకువచ్చారు. వెనువెంటనే వారిని స్థానికంగా ఉన్న దవాఖానలకు తరలించారు. కానీ.. దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక ఇందులో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతి చెందిన వారిలో శివ, ప్రశాంత్, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి ఉన్నారు. వీరంతా 25 ఏండ్ల లోపు వారే. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్లోని 8 అంతస్తులున్న స్వప్న లోక్ కాంప్లెక్స్లో బట్టల దుకాణాలతో పాటు వివిధ రకాల వ్యాపారాలు, పలు కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అందరూ పనులు ముగించుకొని ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో 5వ ఫ్లోర్లోని ఈ కామర్స్ కార్యాలయంలో నుంచి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఇతర కార్యాలయాలతో పాటు 5, 6, 7, 8వ ఫ్లోర్లలోకి వ్యాపించాయి. మంటలు, పొగలు వ్యాపిస్తుండటంతో చాలామంది మెట్ల ద్వారా కిందకు చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న వారు తమ చేతిలోని సెల్ఫోన్ లైట్లను ఆన్ చేసి తాము ఇక్కడ చిక్కుకున్నామంటూ సిగ్నల్స్ ఇచ్చారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది భారీ క్రేన్ల ద్వారా పైఅంతస్తుల దాకా వెళ్లి వారిని కాపాడారు. భవనం మొత్తంలో సుమారు 400 వ్యాపార సంస్థలు ఉండగా… 150 షాపులు, మిగతా అంతస్తుల్లో ఆఫీసులు ఉన్నాయి. ఎక్కువగా కంప్యూటర్లకు సంబంధించిన కార్యాలయాలే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మొత్తం 13 మంది చిక్కుకోగా.. రాత్రి 11 గంటలకు వరకు శ్రమించిన రెస్క్యూ సిబ్బంది వారందరినీ బయటకు తీసుకువచ్చారు. ఇందులో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని గాంధీకి, మరో ఐదుగురిని రెండు ప్రైవేటు దవాఖానలకు తరలించారు. అయితే గాంధీకి తరలించిన ఐదుగురు, ప్రైవేటు దవాఖానలోని ఒకరు ఊపిరి ఆడక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
అగ్ని ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్ అమోయ్కుమార్.. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. డీసీపీ చందనా దీప్తి, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.
సికింద్రాబాద్లోని స్వప్న లోక్ కాంప్లెక్సు ఎప్పుడూ రద్దీతో ఉంటుంది. రకరకాల వ్యాపార సంస్థలు ఉండటంతో అక్కడికి చాలామంది వస్తుంటారు. గురువారం నగరంలో వర్షం కురవడంతో పాటు మేఘావృతమై ఉండటంతో షాపింగ్ కోసం ఆ కాంప్లెక్సుకు ఎక్కువ మంది రాలేదు. సాధారణ పరిస్థితులు ఉంటే అక్కడికి చాలా మంది వచ్చి ఉండే వారు.
పొగలు దట్టంగా వ్యాపించడంతో మంటల్లో చిక్కుకున్న వారు, పొగను పీల్చుకొని స్పృహ కోల్పోయే అవకాశాలుండటంతో వేగంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది భవనం నలుమూలల నుంచి సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద క్రేన్ సహాయంతో బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులకు వెనువెంటనే వైద్య సహాయం అందించారు. రాత్రి 10.30 గంటల సమయంలో బయటకు తీసుకువచ్చిన యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఫైర్ సిబ్బంది ఒకరు అంబులెన్స్లోనే సీపీఆర్ చేశారు. ఆ తర్వాత గాంధీ దవాఖానకు తరలించారు. కానీ దవాఖానకు తీసుకెళ్లేలోపే సదరు యువతి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కొపల్లి ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడుతో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్ల సీఐ ఎం.పవన్ వివరాల ప్రకారం… జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్ 3లో ఉన్న కొపల్లి ఫార్మా రసాయన పరిశ్రమ కొంత కాలంగా మూసి ఉంది. కంపెనీ పక్కన మోడీ బిల్డర్స్ అపార్టుమెంట్ ఉండటంతో వ్యాపించిన మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి 10:30 గంటల వరకు మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది కృషి చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కంపెనీ ఆవరణలో నిల్వ చేసిన రసాయన డ్రమ్ములపై కురిసిన వర్షం వల్ల రసాయన చర్య జరిగి పేలుడు సంభవించి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు పీసీబీ అధికారులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.