హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాబోయే ఐదేండ్లలో ఆత్మనిర్భర భారత్లో భాగంగా 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జాతీయ జెండాను ఎగరేసి.. ప్రసంగించారు. సింగరేణి గత ఏడాది రూ.26 వేల కోట్ల టర్నోవర్ సాధించిందని, ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల ఉత్పత్తితో రూ. 34 వేల కోట్ల టర్నోవర్ సాధించే దిశగా దూసుకెళ్తుందని సీఎండీ అన్నారు. ప్రతి ఏడాది 7-10 శాతం వరకు విద్యుత్ వినియోగం పెరుగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఐదేండ్లలో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సింగరేణి సంసిద్ధంగా ఉన్నదన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ అధికారిగా ఎంపికైన సీనియర్ లా ఆఫీసర్ కొలిశెట్టి కౌశల్, ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన సెక్యూరిటీ గార్డ్ సి.రామకృష్ణలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్, లక్ష్మణ్, ఈడీ జె.అల్విన్, జీఎంలు సురేశ్, సూర్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.