HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్అండ్టీ షాక్ ఇచ్చింది. నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల 6వ తేదీ నుంచి పార్కింగ్కు సైతం ఫీజులు వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఎల్అండ్టీ ప్రకటన చేసింది. గతంలోనూ పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్లు మెట్రో యాజమాన్యం నిర్ణయించగా.. ప్రయాణికుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఆగస్టు 14 నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తామంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద పార్కింగ్ చేసేందుకు వెళ్లిన ప్రయాణికులు బోర్డులు చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఆ తర్వాత మెట్రోస్టేషన్లోనే ఆందోళన చేపట్టారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకొని.. ఎప్పటిలాగే ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలుపడంతో వెనక్కి తగ్గింది. తాజాగా మరోసారి పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక పార్కింగ్ ఫీజుల విషయానికి వస్తే.. బైక్ని 2గంటల పాటు పార్కింగ్ చేస్తే రూ.10 చెల్లించాల్సి వస్తుంది. 8గంటలకు రూ.25 చెల్లించాల్సి ఉండగా.. 12గంటలకు రూ.40 పార్కింగ్ ఫీజుగా నిర్ణయించారు. కార్కి 2గంటలకు రూ.30.. 12గంటలకు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదనంగా ఒక్కో గంటకు రూ.5చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నెలవారీ పాసులు సైతం తీసుకువచ్చారు. పాస్లపై 40శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుండగా.. దాన్ని ఎత్తివేస్తూ ఎల్అండ్టీ మెట్రో నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం 40 స్టేషన్ల పరిధిలో హెచ్ఆర్ఎం, ఎల్అండ్టీ పెయిడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.