మియాపూర్ : మహాశివరాత్రి పర్వదిన వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. వేడుకలలో భాగంగా మంగళవారం తెల్లవారు జాము నుంచే నియోజకవర్గంలోని వివేకానందనగర్, హైదర్నగర్ , ఆల్విన్ కాలనీ, మియాపూర్, చందానగర్, హఫీజ్పేట్, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలోని శివాలయాలకు భక్తులు బారులు తీరారు.
ఉదయం ఆలయాల్లో శివయ్య మూల విరాట్టులకు అర్చకులు మహన్యాస రుద్ర పూర్వక వేదమంత్రాల నడుమ అభిషేకాలను నిర్వహించారు. భక్తుల శివనామస్మరణలతో దేవాలయాలు మారుమోగాయి. కరోనా మహమ్మారి నియంత్రణలో ఉన్న తరుణంలో ఆలయాలకు పెద్ద సంఖ్యలోనే భక్తులు విచ్చేసి శివయ్యను దర్శించుకున్నారు.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ, దీనబంధు కాలనీ పలు ఇతర శివాలయాల్లో విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శివయ్యకు స్వయంగా అభిషేకం చేశారు.
అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ శివుడి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. కరోనా పీడ పూర్తిగా విరుగడవ్వాలని, శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని గాంధీ కోరుకున్నారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు , ఆలయ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.