సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధిస్తూ.. తరచూ షీ టీమ్స్కు చిక్కితే ఆకతాయిలపై రౌడీషీట్ తెరుస్తామని సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ హెచ్చరించారు. ఇప్పటి వరకు పట్టుబడ్డ వారు కౌనెల్సింగ్ తర్వాత తిరిగి పట్టుబడలేదని స్పష్టం చేశారు. ప్రతి నెల సుమారు 100 వరకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిపై వెంటనే స్పందించి షీ టీమ్స్ తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
సైబరాబాద్ పరిధిలో గతంలో ఉన్న కొన్ని హాట్ స్పాట్స్ను తొలగించామని, బాధితుల ఫిర్యాదులతో మరికొన్ని కొత్తవి గుర్తించామని వివరించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర మహిళల భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించి.. పోకిరీల బెడద లేకుండా చేయాలని ఆదేశించడంతో మరికొన్ని కొత్త పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి..పూర్తి సాక్ష్యాధారాలతో ఈవ్ టీజర్లపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీసీపీ చెప్పారు.
ఇక మీదట మహిళలను వేధించి, వారితో అసభ్యంగా ప్రవర్తించి.. తరచుగా పట్టుబడితే వారిపై రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు. అంతేకాకుండా వారి సమాచారం ఎప్పటికీ పోలీస్ రికార్డ్స్లో ఉండేలా ఓ ప్రత్యేకమైన డాటా బేస్ను రూపొందిస్తున్నామని వివరించారు. బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, వారు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. సైబరాబాద్ పరిధిలో 11 షీ టీమ్స్ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయన్నారు.
సైబరాబాద్ వాట్సాప్ నం. 9490617444, బాలానగర్ షీ టీమ్స్ నం.9490617349, ఐటీ కారిడార్-9490617352, మాదాపూర్-8333993519, కూకట్పల్లి-9493626811, జగద్గిరిగుట్ట -9493624561, మియాపూర్-9491051421, పేట్ బషీరాబాద్-7901114137, రాజేంద్రనగర్-7901114140, శంషాబాద్-9490617354, చేవెళ్ల-9493625379, షాద్నగర్-9493624147 లేదా డయల్ 100 లేదా sheteam.cyberabad@gmail.com, mailto: sheteam.cyberabad@ gmail.com, twitter @sheteamcybd, facebook.com wogman & childre safety win, instagram.com womenandchildrensafetywingcybd ఈ వేదికల ద్వారా షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ అనసూయ సూచించారు.