సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగంలో యువ పరిశోధకులు, ఆంత్రప్రె న్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. జాతీయ స్థాయిలో ఉన్న ఐసీఎంఆర్ పరిశోధన కేంద్రాల్లోని ల్యాబోరేటరీలను ఇతరులు కూడా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రీసెర్చ్ వర్క్ స్పేస్ షేరింగ్ ఫెసిలిటీ పేరిట కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ వేదికగా ఐసీఎంఆర్కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా మరో 21 సెంటర్లు వివిధ అంశాలపై పనిచేసే పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా సెంటర్లలో ఆధునాతన సౌలతులు, ల్యాబోరేటరీ మెషనరీతోపాటు పరిశోధనలకు అవసరమైన సకల వసతులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయా సెంటర్లలో పనిచేసే పరిశోధకులు, సైంటిస్టులు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. ఇకపై జాతీయ స్థాయిలో ఉన్న యంగ్ ఆంత్రప్రెన్యూర్లు, రీసెర్చ్ ఫెలో కూడా వినియోగించుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
మెరుగైన పరిశోధనలకు అవకాశం
ఈ విధానం అమలుల్లోకి వస్తే టైర్- 2 సిటీల్లోనూ మెరుగైన పరిశోధనలు జరిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆయా కేంద్రాల్లోని ఆధునాతన ల్యాబోరేటరీలను వినియోగించుకునే వీలు ఉంటుంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులు, రీసెర్చ్ ఫెలోపాటు, స్టార్టప్ నిర్వాహకులు, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. పరిశోధన రంగంలో మౌలిక వసతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతోపాటు.. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా అకాడమీ, రీసెర్చ్ ల్యాబోరేటరీలకు అనుసంధానం చేయడంలో కీలకంగా మారుతుందని చెబుతు న్నారు. దీంతో పరిశోధనల్లో నాణ్యత ప్రమాణాలు కూడా పెంచేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖరీదైన ల్యాబోరేటరీ సేవలను కూడా తక్కువ ధరలో, ఎలాంటి నిర్వహణ భారం తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
నిబంధనలు వర్తిస్తాయి..
దేశంలో వైద్య విజ్ఞాన రంగంలో కీలకమైన ఐసీఎంఆర్ ప్రయోగశాలలను వినియోగించుకోవాలంటే కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆయా కేంద్రాల్లో ఉండే పరికరాల వివరాలను పీ-రైజ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతోపాటు వీటిని ఐసీఆర్ఎం సెంట్రల్ యూనిట్ నుంచి పర్యవేక్షిస్తోంది. ఆయా కేంద్రాల్లో జరిగే పరిశోధనలు, చార్జీల వివరాలతోపాటు నిర్ణీత కాలపరిమితి వంటి నిబంధనలతో కూడిన షేరింగ్ ల్యాబోరేటరీ విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.