సిటీబ్యూరో/ కుత్బుల్లాపూర్, మే 23 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో మహిళా ఉద్యోగులకు భద్రత కరువైంది. కార్మికుల నుంచి అధికారిణి వరకు కీచకుల నుంచి లైంగిక వేధింపులు తప్పడం లేదు.. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కారం) చట్టం 2013ను పక్కాగా అమలు చేయాల్సిన చోట జీహెచ్ఎంసీలో తరచూ ఏదో ఒక చోట ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా గాజులరామారం సర్కిల్-25లో శానిటేషన్ విభాగంలో ఎస్ఎఫ్ఏగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిగా పనిచేస్తున్న కిషన్ భాగోతం బయటపడింది.
మహిళా శానిటేషన్ వర్కర్పై లైంగిక వేధింపులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్కు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో జోనల్, డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్లతో విచారణ జరిపించారు. వారు నివేదిక అందించడంతో కఠినమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
శానిటేషన్ సూపర్వైజర్ (ఎస్ఎఫ్ఏలు/శానిటరీ ఫీల్డ్ ఆఫీసర్) పి.కిషన్, సీహెచ్ ప్రణయ్లను విధుల నుంచి తొలగించారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల నుంచి సురక్షితమైన, భద్రతతో కూడిన పని వాతావరణాన్ని కల్పించాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీలో వేధింపుల నివారణ కమిటీ వేసినా తూతూ మంత్రంగానే ఉండడం గమనార్హం.
గతంలో చార్మినార్ జోన్లో ఓ స్టాటజికల్ ఆఫీసర్ (బలమైన సామాజిక వర్గానికి చెందిన అధికారి) మహిళా ఉద్యోగి (కంప్యూటర్ ఆపరేటర్)పై లైంగిక వేధింపుల ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసి స్వయంగా బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన మేయర్ వెంటనే సదరు అధికారిపై విచారణకు ఆదేశించి, నివేదిక ఆధారంగా సస్పెండ్ వేటు పడింది.
ఇదే సమయంలో కూకట్పల్లి జోన్లో ఓ డీసీ.. ప్రస్తుతం ఎల్బీనగర్ సర్కిల్లో చేస్తున్న డిప్యూటీ కమిషనర్ ఓ మహిళపై జరిపిన లైంగిక వేధింపులను తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా బయట పెట్టారు. డీసీ స్థాయి అధికారి కావడంతో పైరవీతో ఆయనపై ఉన్నతాధికారులు నామ మాత్రపు చర్యలు తీసుకున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఎస్ఈ స్థాయి అధికారి ఓ మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడితే సదరు బాధితురాలు షీ టీంకు ఫిర్యాదు చేసింది.
ప్రతి రోజు పనిచేసే కార్మికులను సెల్ఫోన్ ద్వారా ఫొటో స్కానింగ్ అటెండెన్స్ తీసుకోవాలి. తన ఇంట్లో పెండ్లి ఉండడంతో అటెండెన్స్ తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తకుండా తన వద్ద పనిచేసే మరో వర్కర్ ప్రణయ్ అనే ఔవుట్ సోర్సింగ్ కార్మికుడికి తన సెల్ఫోన్ ఇచ్చి పంపాడు. సదరు వర్కర్ సెల్ఫోన్లో ఉన్న వీడియోలు, ఫొటోలు కన్పించడంతో ఎస్ఎఫ్ఏ కిషన్, సదరు మహిళా కార్మికురాలిని మందలించాడు. అంతటితో ఆగకుండా వారి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు వర్కర్ వీడియోలు, ఫొటోలు ఆన్లైన్ మాద్యమంలో పెట్టాడు. దీంతో విషయం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి రావడంతో ఎస్ఎఫ్ఏ కిషన్ను గత వారం రోజుల కిందట విధుల నుంచి తప్పించారు.
గాజులరామారం సర్కిల్ -25లో గత ఐదేండ్లుగా శానిటేషన్ విభాగంలో శ్రీదుర్గాభవానీ ఏజెన్సీలో కిషన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సర్కిల్ పరిధి సూరారం డివిజన్ షాపూర్నగర్ ఏరియాలో ఎస్ఎఫ్ఏగా పని చేస్తుండగా తన కింద మూడు బ్యాచ్లకు చెందిన 21 మంది మున్సిపల్ స్వీపర్ కార్మికులు పని చేస్తున్నారు. అయితే అందులో పని చేసే ఓ మహిళా వర్కర్ను కిషన్ గత కొంతకాలంగా లోబర్చుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో తన సెల్ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు.
ఎస్ఎఫ్ఏ కిషన్ ఆరాచకాలను పసిగట్టిన అవుట్సోర్సింగ్ కార్మికుడు ప్రణయ్ తన డిమాండ్లకు అంతులేకుండా పోయినట్లు సమాచారం. వీరికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు లీక్ కాకుండా ఉండాలంటే తాను అడిగినంత డబ్బులు ఇస్తే సరి.. లేదంటే సోషల్ మీడియాలో పెడుతానని పలుమార్లు ఎస్ఎఫ్ఏతో పాటు బాధిత కార్మికురాలిని బెదిరింపులకు గురి చేశాడు. దీనికి వారు సమాధానం ఇవ్వకపోవడంతో ప్రణయ్ వీడియోలు లీక్ చేయడంతో బాగోతం బయటపడింది. దీంతో సర్కిల్ ఉన్నతాధికారులు ప్రణయ్ భాగస్వామ్యం ఉండడంతో విధుల నుంచి తొలగించిన్నట్లు వెళ్లడించారు.
కుత్బుల్లాపూర్-గాజులరామారం సర్కిళ్లలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమ పైస్థాయి అధికారుల నుంచి అనేక వేధింపులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పొరపాటుగా సెలవు కోరినా, ఒంట్లో బాగాలేకున్నా తప్పనిసరిగా పనికి రావాల్సిందేనని లేని పక్షంలో విధుల నుంచి తొలగిస్తామని ఎస్ఎఫ్ఏలు బెదిరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఓ మహిళా కార్మికురాలు ఓటు వేసేందుకు తన ఊరికి వెళ్లగా మరుసటి రోజు ఆలస్యం కావడంతో విధులకు రాలేకపోయింది.
దీంతో సదరు ఎస్ఎఫ్ఏ తీవ్రస్థాయిలో మందలించి వారం రోజుల వరకు పని చేయకుండా అడ్డుకున్నాడు. చివరకు వారి పైస్థాయి అధికారి వద్ద ఓ బాండ్ పేపర్ పెట్టుకొని విధులకు తిరిగి చేర్చుకున్నారని సమాచారం. మరో కార్మికురాలు తాను పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నానని తనవంతుగా తన కొడుకుకు పని ఇప్పించాలని వేడుకోవడంతో దాదాపుగా రూ.2.50 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.
కార్మికులకు తలెత్తే అనేక ఇబ్బందుల పట్ల ఉన్నతాధికారులకు తెలిసినా తదుపురి చర్యలు తీసుకోకుండా గప్చూప్గా ఉండడమే ఈ సంఘటనలకు తావునిస్తుందని చర్చ జరుగుతుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సమయంలో కిందిస్థాయిలో ఏం జరుగుతుంది..? దీనికి కారణాలు తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకుండిపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఆరాచకాలకు ఊతమిచ్చిన్నట్లు మారుతుంది.