మ్యాన్హోల్ మూసుకుపోయి.. రోడ్లపైకి మురుగునీరు పరుగులు పెట్టడం అప్పుడప్పుడూ నగరంలో చూస్తుంటాం. చాలా సందర్భాల్లో బీటీ రోడ్ల కింద ఇలా కనిపించకుండా పోయిన మ్యాన్హోళ్లను గుర్తించడం ఎంతో కష్టతరంగా మారుతున్నది. ఈ సమస్యను పరిష్కరిచేందుకు బల్దియా ఇజ్రాయెల్ నుంచి కొత్త యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యాగ్నటిక్ సెన్సార్తో పనిచేసే ఈ డిటెక్టర్ వల్ల మురుగు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించనున్నది. బీటీ రోడ్ల కింద మూసుకుపోయిన మ్యాన్హోళ్లను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. మ్యాన్హోల్ మరమ్మతుల్లో సివరేజీ సిబ్బంది ఇబ్బందులకు మ్యాగ్నటిక్ సెన్సార్తో చెక్ పెట్టనున్నారు. మ్యాన్హోళ్ల నుంచి డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా జలమండలి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. మురుగు పరుగుతో వాహనదారులు, పాదచారులకు అసౌకర్యం కలుగకుండా జలమండలి అధికారులు ఈ ఆధునిక యంత్రాలను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ మేరకు జలమండలి అధికారులు గురువారం యూసుఫ్గూడలో సంబంధిత మిషన్తో పనులు ప్రారంభించారు. ఆయా పనులను జలమండలి డివిజన్-6 జనరల్ మేనేజర్ హరిశంకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సెక్షన్ మేనేజర్లతో కలిసి పర్యవేక్షించారు.