GHMC | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఒక వ్యక్తి మురుగులోకి దిగి మరో వ్యక్తి శుభ్రం చేయడమంటే అది అనాగరికం! మరి.. విశ్వ నగరం అని కీర్తించుకుంటున్న హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున నాగరిక ప్రపంచంలో ఈ అనాగరిక దృశ్యం అందరినీ కలిచివేసింది. రెండు రోజుల కిందట నగరంలోని గోల్నాక ప్రాంతంలో మ్యాన్హోల్లోకి దిగి కూలీలు డ్రైనేజీని శుభ్రం చేస్తూ కనిపించిన దృశ్యమిది. బాధ్యత కలిగిన ఒక పౌరుడు స్పందించి ఫొటోలు తీసి ‘నమస్తే తెలంగాణ’కు అందించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ కూలీలకు రోజుకు రూ.1100 (జంటకు… మగవారికి రూ.600, ఆడవారికి రూ.500) ఇచ్చి శుభ్రం చేయిస్తున్నారు. వాస్తవానికి ఇది వాన నీటి ప్రవాహం కోసం నిర్మించిన పైప్లైన్ (రెయిన్ వాటర్ పైప్లైన్). ఇందులో కేవలం వర్షపు నీళ్లు మాత్రమే పారాలి. కానీ అందుకు విరుద్ధంగా అధికారులు మురుగు నీటిని (డ్రైనేజీ లైన్) అనుసంధానం చేశారు.
అందుకే మ్యాన్హోళ్లను శుభ్రం చేస్తున్న సమయంలో అటుగా వెళ్లే పాదాచారులు దుర్గంధంతో ముక్కు మూసుకొని వెళ్తున్నారు. అయితే ఈ రహదారిలో అసలు మురుగునీటి వ్యవస్థ ఎందుకు లేదు? వాన నీటి కోసం నిర్మించిన వ్యవస్థలో మురుగునీరు ఎందుకు వస్తుంది? జలమండలి మురుగునీటి వ్యవస్థను నిర్వహిస్తుండగా.. ఇక్కడ ఆ బాధ్యతను జీహెచ్ఎంసీ ఎందుకు చేపడుతుంది? ఇవన్నీ సందేహాలు ఒక ఎత్తయితే… కోట్లాది రూపాయలు వెచ్చించి నగరంలో ఎయిర్టెక్ యంత్రాలను కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకుంటున్న ప్రభుత్వ విభాగాలు.. అసలు మురుగులోకి దింపి వ్యక్తులతో శుభ్రం చేయించడం సభ్య సమాజానికి సిగ్గు చేటు! ఇక్కడ ఇంకో విషయం… కొన్నిరోజుల కిందటే జియాగూడలో ఓ డ్రైనేజీ లైన్ అనుసంధానం కోసం మ్యాన్హోల్లో దిగిన ముగ్గురు కూలీలు మృత్యువాతపడిన ఘోరకలి మదిలో మెదులుతుండగానే ఈ దృశ్యాలు కనిపించాయి.