దుండిగల్, జూన్ 1: ఓ ఫార్మా పరిశ్రమలో గ్యాస్లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇప్పటికే నలుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాచుపల్లి నుంచి ఐడీఏ బొల్లారం రోడ్డులో ఉన్న అరబిందో ఫార్మా పరిశ్రమ యూనిట్-3లో గురువారం పలువురు కార్మికులు రోజు మాదిరిగానే పనిచేస్తున్నారు.
ఉదయం 11 గంటల సమయంలో ప్రాసెసింగ్ సెక్షన్-1లో మిథేల్ డైక్లోరైడ్ అనే గ్యాస్ లీకైంది. గ్యాస్ను పీల్చుకున్న కార్మికుల్లో ఏడుగురు స్పృహతప్పి పడిపోయారు. పరిశ్రమ యాజమాన్యం వెంటనే వారిని సమీపంలోని ఎస్ఎల్జీ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. వీరిలో నలుగురు కార్మికులు ఎన్.గౌరీనాథ్, యాసీన్ అలీ, ప్రేమ్ కమల్, ప్రసాద్రాజు కోలుకోవడంతో వారిని డిశ్చార్జీ చేశారు.
మిగిలిన ముగ్గురు కార్మికులు కె.శ్రీనివాస్, విమల, గౌరీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కావడంతో చికిత్స పొందుతున్నారు. వారికి మరో మూడు రోజులు చికిత్స అందించాల్సి వస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా తీవ్ర అస్వస్థతకు గురికాగా.. వారిని రహస్యంగా వేరే ఆస్పత్రికి తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.