నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా నిలుస్తున్న సెట్విన్ కేంద్రాలు ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. నాలుగు దశాబ్దాలుగా యువతీ యువకులకు విశేష సేవలందిస్తున్న ఈ కేంద్రాలు నూతన మార్గదర్శకత్వానికి నాంది పలుకుతున్నాయి. తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేడు 15 వేల మందికి పైగా నిరుద్యోగులకు శిక్షణనిచ్చే సెట్విన్ కేంద్రాలలో కరోనా ప్రభావంతో ఆఫ్లైన్ తరగతులకు బ్రేక్ పడింది. దీంతో 2019-20లో శిక్షణా తరగతులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కేవలం 6600 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వగలిగారు. ఈ ఏడాది జులై నుంచి అడ్మిషన్లు ప్రారంభించినా కొవిడ్ నేపథ్యంలో తరగతులు మందకొడిగా సాగుతున్నాయి.
ఈ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న సెట్విన్ అధికారులు ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుడుతున్నారు. నగరంలోని 20 సెట్విన్ కేంద్రాల్లో యథావిధిగా శిక్షణాతరగతులు కొనసాగిస్తూనే ఏ రంగంలో ఉన్న వారైనా.. ఏ సమయంలోనైనా ఆన్లైన్లో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్వయం ఉపాధి శిక్షణను నిరంతరాయంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వయం ఉపాధి కోర్సులకు కేరాఫ్గా ఉన్న సెట్విన్లో త్వరలో ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 40 సంవత్సరాలకు పైగా నిరుద్యోగులకు బాసటగా ఉంటూ స్వయం ఉపాధి శిక్షణలో తనదైన ముద్రవేసిన సెట్విన్ ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టనుంది. కరోనా ప్రభావంతో ఉపాధి శిక్షణ కోర్సులు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఈ ఆన్లైన్ కోర్సులకు రూపకల్పన చేసింది. ఇప్పటికే సెట్విన్ కేంద్రాలలో 47 స్వయం ఉపాధి కోర్సులలో శిక్షణ అందిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ ఏడాది కంప్యూటర్ సంబంధిత 25 కోర్సుల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. సెట్విన్ ఆన్లైన్ పోర్టల్లో శిక్షణకు సంబంధించి పూర్తి నిడివి గల వీడియో తరగతులను పొందుపరిచారు. నిరుద్యోగ యువతీ, యువకులతో పాటు విద్యార్థులు ఆ వెబ్సైట్లోకి వెళ్లి ఆయా కోర్సులను నేర్చుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు సైతం ఏ సమయంలోనైనా ఆన్లైన్ తరగతులను వినొచ్చు. అదే సమయంలో సందేహాలను సైతం నివృత్తి చేసుకోవచ్చు.
నిరుద్యోగ యువతీ యువకులకు నామమాత్రం ఫీజులతో నాణ్యమైన ఉపాధి కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించే ప్రయత్నాలు ప్రారంభించాం. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.సెట్విన్.ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వీడియోల రూపంలో ఉన్న తరగతులను తమకు వీలున్న సమయంలో వినవచ్చు. ఆ తర్వాత ఆన్లైన్లోనే పరీక్షలకు హాజరై సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆన్లైన్ శిక్షణా తరగతులను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలి. – వేణుగోపాల్ రావు, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్