సిబ్బందికి వీలైనంత వరకు ఆన్లైన్లోనే సేవలు
అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన సీపీ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని, అందులో ప్రస్తుతం ఎన్ని పనిచేస్తున్నాయనే విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆరా తీశారు. ఒమిక్రాన్ వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కమిషనరేట్ కార్యాలయంలోని అన్ని విభాగాలను మంగళవారం ఆయన అదనపు సీపీ చౌహాన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సిబ్బందికి అవసరమైన పనులు వీలైనంత వరకు ఆన్లైన్లోనే పూర్తి చేయనున్నట్లు వివరించారు. అన్ని విభాగాలను సీపీ స్వయంగా పరిశీలించారు. ఆయా విభాగాల్లోని గదులలో పరిశుభ్రత, వెంటిలేషన్పై ఆరా తీశారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. మధ్యాహ్న భోజనం, టీ విరామం సమయంలో గుంపులుగా ఒకే చోట ఉండకుండా చూసుకోవాలన్నారు. సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన ఫర్నిచర్కు రంగులు వేయాలని, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శానిటైజర్, మాస్కులు కొనుగోలు చేసి సిబ్బందికి పంపిణీ చేసేందుకు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్మీడియా వింగ్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఇతర ఐటీ ప్రాజెక్ట్ల స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సునీతారెడ్డి పాల్గొన్నారు.