మూసాపేట, జూలై 13: ఇంటికి రక్షణ కల్పించాల్సిన వ్యక్తే దోచుకెళ్లాడు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు కథనం ప్రకారం… వివేకానందనగర్లోని వడ్డేపల్లి దామోదర్రావు ఇంటిలో ఎనిమిది నెలల కిందట నేపాల్కు చెందిన చక్రధర్ వాచ్మన్గా చేరాడు. భార్య, కొడుకుతో కలిసి ఉంటూ నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈనెల 6న నాగ్పూర్లోని తమ బంధువుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి..తిరుగు ప్రయాణంలో తనతో పాటు ఓ గుర్తుతెలియని వ్యక్తిని తీసుకొచ్చాడు.
మంగళవారం రాత్రి దామోదర్ కుటుంబ సభ్యులందరూ కొంపల్లిలోని ఓ ఫంక్షన్కు వెళ్లగా, అదే అదునుగా భావించిన చక్రధర్, గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ. 30 లక్షల నగదు, 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని ఆటోలో కుటుంబంతో సహా పరారయ్యారు. దామోదర్రావు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు లక్డీకాపూల్ వరకు వెళ్లారని గుర్తించారు. మాదాపూర్ డీసీపీ కె.శిల్పవల్లి ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.